Income Tax | వేతన జీవులకు వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఊరట లభిస్తుందా.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయం పన్ను మినహాయింపు పరిమితి పెంచబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. ఒకవేళ అదే జరిగితే, సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఈ డిమాండ్ కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ సాకారం చేసినట్లే. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం వ్యక్తిగత ఆదాయం పరిమితి రూ.5 లక్షలకు పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తున్నది.
ఆదాయం పన్ను పరిమితి మినహాయింపులపై వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రతిపాదనలు వెల్లడిస్తారు. అదే జరిగితే ఇప్పుడు అమల్లో ఉన్న రూ.2.5 లక్షల ఆదాయం పరిమితిని రూ.5 లక్షలకు పెంచనున్నట్లు విశ్వసనీయ వర్గాల కథనం.
కరోనా మహమ్మారి ప్రభావం.. అటుపై ఆకాశాన్నంటే రీతిలో పైపైకి దూసుకెళ్లిన నిత్యావసర వస్తువుల ధరలు.. వాటిని కట్టడి చేయడానికి ఆర్బీఐ.. కీలక రెపోరేట్.. తదనుగుణంగా బ్యాంకులు కీలక వడ్డీరేట్లు పెంచేశాయి. ఇతర దేశాల్లోనూ సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లు పెంచడంతో ఆర్థిక మాంద్యం ముప్పు ముంచుకొస్తున్నది.
ఈ తరుణంలో ఆదాయం పన్ను పరిమితి పెంచడం వల్ల వినియోగం పెరిగిపోయి, ఎకానమీ గాడిలో పడుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఇన్కం పరిమితి పెంచడంతో వివిధ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడానికి వెసులుబాటు లభిస్తుంది.
ఇప్పటికైతే ప్రతి ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షల్లోపు వ్యక్తిగత ఆదాయంపై ఎటువంటి పన్ను లేదు. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయంపై ఐదు శాతం వర్తిస్తుంది. మహిళలు, సీనియర్ సిటిజన్ల (60-80 ఏండ్ల లోపు) కు రూ.3 లక్షలు, 80 ఏండ్లు దాటిన వారికి రూ.5 లక్షల వరకు పన్ను మినహాయింపు అమల్లో ఉన్నది.
60 ఏండ్ల లోపు.. ప్రత్యేకించి వేతన జీవులు తమ ఆదాయం పన్ను పరిమితి రూ.5 లక్షలకు పెంచాలని ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నారు. కానీ గత కొన్ని బడ్జెట్లలో వారిని ఆర్థిక మంత్రి నిరాశ పరుస్తూనే ఉన్నారు.
అయితే, 2024లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ ఇదే కావడం గమనార్హం. ఈ బడ్జెట్ లోనైనా తమ కలను విత్త మంత్రి నిర్మలా సీతారామన్ నెరవేరుస్తారని ఆశాభావంతో ఉన్నారు.