ముంబై, అక్టోబర్ 18: బీఎస్ఈ సెన్సెక్స్ రికార్డు పరుగు కొనసాగుతోంది. 61,000 స్థాయిని దాటి ఒక ట్రేడింగ్ సెషన్ గడిచినంతనే 62,000 పాయింట్ల స్థాయిని సమీపించింది. సోమవారం ఇంట్రాడేలో సెన్సెక్స్ 61,963 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది. చివరకు 460 పాయింట్ల లాభంతో 61,766 పాయింట్ల వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం ఇదేబాటలో 18,543 పాయింట్ల ఇంట్రాడే రికార్డు గరిష్ఠాన్ని తాకింది. తుదకు 138 పాయింట్ల లాభంతో 18,477 పాయింట్ల వద్ద ముగిసింది. ఇతర ప్రపంచ ప్రధాన మార్కెట్లు… చైనా నుంచి వెలువడిన ప్రతికూల వార్తతో డీలాపడినా, భారత్ సూచీలు ముందడుగు వేయడం గమనార్హం. చైనా జీడీపీ సెప్టెంబర్ త్రైమాసికంలో 4.9 శాతం మాత్రమే వృద్ధిచెందింది. దీంతో షాంగై, టోక్యో, సియోల్, హాంకాంగ్ సూచీలు 2 శాతం వరకూ పతనంకాగా, యూరప్ సూచీలు నష్టాల్లో ట్రేడయ్యాయి. అయితే ఇక్కడ బ్యాంకింగ్, ఐటీ, మెటల్, ఎనర్జీ షేర్లలో ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరపడంతో సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త రికార్డుస్థాయిల వద్ద ముగిసాయి.
రూ.12 లక్షల కోట్లు పెరిగిన సంపద
వరుసగా ఏడు రోజులుగా జరిగిన ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద రూ.12 లక్షల కోట్ల మేర పెరిగింది. తాజాగా బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.274.7 లక్షల కోట్లకు చేరింది.
మార్కెట్ విశేషాలివి…