ముంబై, డిసెంబర్ 9: దేశవ్యాప్తంగా ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్)తో టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ జట్టుకట్టింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంతో దేశీయంగా 7 వేల చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నాయి. దేశీయ రోడ్లపై టాటాకు చెందిన 1.15 లక్షల ఈవీ వాహనాలు తిరుగుతుండుటంతో వీటికి చార్జింగ్ సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో బీపీసీఎల్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా బీపీసీఎల్కు ఉన్న 21 వేల పెట్రోల్ బంకుల్లో మూడోవంతు 7 వేల స్టేషన్లలో చార్జింగ్ సదుపాయాలను వచ్చే ఏడాదిలోగా అందుబాటులోకి రానున్నాయి.