న్యూఢిల్లీ, ఆగస్టు 16: కొండెక్కి కూర్చున్న పెట్రోల్ ధరలు తగ్గుతాయన్న సామాన్యుడి ఆశలపై కేంద్రం నీళ్లుచల్లింది. పెట్రోల్, డీజిల్పై ఎక్సయిజు సుంకాన్ని తగ్గించేది లేదంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. సోమవారంనాడిక్కడ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇంధన సబ్సిడీల కోసం గత యూపీఏ ప్రభుత్వం జారీచేసిన ఆయిల్బాండ్లు, వడ్డీలకు ఇప్పుడు చెల్లింపులు చేస్తున్నందున, పెట్రో ఎక్సైజ్ సుంకాల్ని తగ్గించలేమని చెప్పారు. గత ఐదేళ్లుగా ఈ బాండ్లపై రూ.60,000 కోట్ల వడ్డీని చెల్లించామని, ఇంకా రూ.1.30 లక్షల కోట్ల బకాయిలున్నాయని ఆమె వివరించారు.
అదుపులోనే ద్రవ్యోల్బణం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న శ్రేణిలోనే ద్రవ్యోల్బణం ఉంటుందన్న అంచనాల్ని సీతారామన్ వెల్లడించారు. ద్రవ్యోల్బణం 4 శాతానికి 2 శాతం ఇటూఇటూగా ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయాలని రిజర్వుబ్యాంక్ లక్ష్యంగా నిర్దేశించికుంది. కొద్దినెలలుగా జీఎస్టీ పన్ను వసూళ్లు, ప్రత్యక్ష పన్ను వసూళ్లు మెరుగుపడ్డాయని, రానున్న నెలల్లో ఇవి మరింత పుంజుకుంటాయని ఆర్థిక మంత్రి తెలిపారు. ఆదాయపు పన్ను శాఖ కొత్త పోర్టల్లో తలెత్తిన సమస్యలు ఒకటి, రెండు వారాల్లో తొలగిపోతాయని చెప్పారు.
రెట్రో నిబంధనల్ని రూపొందిస్తాం
కెయిర్న్ ఎనర్జీ, వొడాఫోన్-ఐడియా తదితర కంపెనీలపై జారీచేసిన రెట్రోస్పెక్టివ్ టాక్స్ పన్ను డిమాండ్లను రద్దుపర్చేందుకు తగిన నియమ నిబంధనల్ని త్వరలో రూపొందిస్తామని సీతారామన్ తెలిపారు. రెట్రో టాక్స్ రద్దు బిల్లు ఇటీవల పార్లమెంటు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. రెట్రో టాక్స్ కేసుల ఎత్తివేత, రిఫండ్, సెటిల్మెంట్ అంశాలపై మంత్రిత్వశాఖ అధికారులు కెయిర్న్, వొడాఫోన్తో చర్చిస్తున్నారని, తనతో ఇంకా చర్చలు జరగలేదని ఆమె వివరించారు.
క్యాబినెట్ ముందుకు క్రిప్టోకరెన్సీ బిల్లు
క్రిప్టోకరెన్సీపై ప్రతిపాదిత చట్టం కోసం క్యాబినెట్ ఆమోదానికి తాను వేచిచూస్తున్నానని సీతారామన్ చెప్పారు. ‘వర్చువల్ కరెన్సీపై మంత్రుల కమిటీ ఇప్పటికే ఒక నివేదికను సమర్పించింది. ప్రభుత్వం జారీచేసే వర్చువల్ కరెన్సీ మినహా అన్ని ప్రైవేటు క్రిప్టోకరెన్సీలను నిషేధించాలంటూ ఆ కమిటీ సూచించింది. ఇందుకు క్యాబినెట్ నోట్ సిద్ధమయ్యింది’ అని మంత్రి తెలిపారు.