Rapido | బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్ రాపిడోకు బాంబే హైకోర్టు శుక్రవారం షాక్ ఇచ్చింది. టూ వీలర్స్, త్రీ వీలర్స్ ట్యాక్సీలు నడిపేందుకు లైసెన్స్ ఇవ్వడానికి పుణె రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ (ఆర్టీవో) నిరాకరించింది. దీనిపై బాంబే హైకోర్టును ఆశ్రయించింది రాపిడో. ఈ పిటిషన్పై విచారించిన న్యాయస్థానం పుణె ఆర్టీవో ఆదేశాలను కొట్టి పారేయలేమని స్పష్టం చేసింది. మహారాష్ట్రలో కార్యకలాపాలు నిలిపేయాలని రాపిడో యాజమాన్యాన్ని హైకోర్టు కోరింది.
టూ వీలర్, త్రీ వీలర్స్ ట్యాక్సీలను నడుపుకునేందుకు రాపిడోకు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి లైసెన్స్ లేదని బాంబే హైకోర్టు పరిశీలనలో తేలింది. ఈ నేపథ్యంలో రాపిడో పిటిషన్కు విచారణ అర్హత లేదని న్యాయస్థానం పేర్కొంది. రాపిడో వైఖరిలో వైరుధ్యాలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఒకవైపు టూ వీలర్స్ ట్యాక్సీల నిర్వహణపై రాష్ట్రానికి విధానం లేదంటూనే.. మరోవైపు మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు-2020 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి విధానం లేకపోవడం సరి కాదని రాపిడో వాదించింది.
`రెండు పరస్పర వాదనలను పరిశీలించడం కష్టం. మార్గదర్శకాలే అమలు కానప్పుడు, వాటిని పాటించకపోవడం సమస్య ఎక్కడ ఉంది. మార్గదర్శకాలకు వ్యతిరేకంగా, లైసెన్స్ లేకుండా ట్యాక్సీలను నడుపుతామని చెబుతున్న రాపిడో వాదన మాకు అర్థం కావడం లేదు. విధాన వైఫల్యం కారణంగా ఆర్టీవో ఆదేశాలను తిరస్కరించలేం` అని న్యాయస్థానం స్పష్టం చేసింది. కేంద్రం మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్లైన్స్-2020కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలనేం లేదని, రాష్ట్రం తనకంటూ విడిగా నిబంధనలు అమలు చేయొచ్చునని తేల్చి చెప్పింది.