Biryani | భారతీయులు భోజన ప్రియులు.. తమకు ఫేవరేట్ తినుబండారాలు పాయసం.. స్వీట్లు అంటే చెవి కోసుకుంటారు.. బిర్యానీ అంటే ప్రతి ఒక్కరికీ ఎంతో ఇష్టం.. బిర్యానీ ఇట్టే లాగించేస్తారు. వంట చేసుకునే ఓపిక లేకపోయినా.. కొత్తదనం కోసం ఫుడ్ డెలివరీ యాప్లకు ఆర్డర్లు చేసేస్తుంటారు. అలా ఫుడ్ డెలివరీ యాప్లకు ఈ ఏడాది ఎక్కువగా వచ్చిన ఆర్డర్లలో ‘బిర్యానీ’కే అగ్ర తాంబూలం లభించింది. గత ఎనిమిదేండ్లుగా భారతీయుల్లో అత్యధికులు ఇష్టపడే భోజనం ‘బిర్యానీ’గా తేలింది. 2023లో ఫుడ్ ఆర్డర్ల వివరాలను డెలివరీ యాప్లు.. జొమాటో.. స్విగ్గీ వెల్లడించాయి. ఈ ఏడాది జొమాటోకు వచ్చిన ఆర్డర్లలో 10.09 కోట్లు ‘బిర్యానీ’ కోసం వచ్చినవే. రెండో స్థానంలో నిలిచిన పిజ్జాల కోసం 7.45 కోట్లు, నూడిల్స్ కోసం 4.55 కోట్ల ఆర్డర్లు వచ్చాయి.
ఢిల్లీలోని 8 కుతుబ్ మినార్ ప్రాంతం నుంచే అత్యధికంగా బిర్యానీ కోసం ఆర్డర్లు వచ్చాయని జొమాటో వెల్లడించింది. తర్వాతీ స్థానంలో నిలిచిన పిజ్జాల కోసం కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం నుంచే ఎక్కువగా ఆర్డర్లు వచ్చాయి. ఇక నూడిల్స్ కోసం ఎక్కువగా 22 సార్లు ఆర్డర్ చేశారని తెలిపింది. ముంబైకి చెందిన ఒకే ఒక వ్యక్తి ‘హానీస్’ ఈ ఏడాది మొత్తం 3580 ఫుడ్ ఆర్డర్లు చేశారని.. రోజుకు తొమ్మిది ఆర్డర్లు నమోదయ్యాయని జొమాటో వివరించింది.
స్విగ్గీకి వచ్చిన ఆర్డర్లలోనూ బిర్యానీదే పై చేయి. ఈ ఏడాది ప్రతి సెకన్కు 2.5 బిర్యానీ ఆర్డర్లు వచ్చాయని తెలిపింది. వెజ్ బిర్యానీ కంటే చికెన్ బిర్యానీకి 5.5 రెట్లు ఆర్డర్లు అందుకున్నట్లు పేర్కొంది స్విగ్గీ. ఈ ఏడాది 40,30,827 మంది బిర్యానీ కోసం సెర్చ్ చేశారు. ఇక బిర్యానీకి మారుపేరుగా నిలిచిన హైదరాబాద్ నుంచి స్విగ్గీకి వచ్చిన ఆర్డర్లలో ప్రతి ఆరో ఆర్డర్ ‘బిర్యానీ’ కోసం వచ్చినవే.
ముంబైకర్లు ఈ ఏడాది 42.3 లక్షల ఫుడ్ ఆర్డర్లు చేస్తే, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ల్లో పది వేలకు పైగా ఆర్డర్లు నమోదయ్యాయి. ఒక రోజులో జైపూర్లో గరిష్టంగా 67 ఫుడ్ ఆర్డర్లు వచ్చాయని తెలిపింది స్విగ్గీ. ఇక ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే సందర్భంగా నిమిషానికో 271 కేక్ ఆర్డర్లు వచ్చాయని పేర్కొంది. దుర్గా పూజ సందర్భంగా 77 లక్షలకు పైగా గులాబ్ జామ్ ఆర్డర్లు అందుకున్నట్లు వివరించింది.