‘ప్రజాస్వామ్యానికి వాక్ స్వాతంత్య్రం గట్టి పునాది. మానవాళికి అవసరమైన కీలక అంశాల్ని చర్చించడానికి భవిష్యత్తులో ట్విట్టర్ ఒక డిజిటల్ వేదిక. కొత్త ఫీచర్లతో ట్విట్టర్ను రూపుదిద్దుతాం. అల్గారిథమ్ను ఓపెన్సోర్స్లో ఉంచి ఈ వేదిక పట్ల విశ్వసనీయత పెంచుతాం. నన్ను విమర్శించేవారూ ట్విట్టర్లో కొనసాగుతారు. వాక్ స్వాతంత్య్రం అంటే అదే’
–ఒప్పందం ఖరారైన తర్వాత ఎలాన్ మస్క్
శాన్ఫ్రాన్సిస్కో, ఏప్రిల్ 26: మైక్రోబ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ ఎట్టకేలకు ప్రపంచ కుబేరుడు, ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ చేతికే చిక్కింది. సంస్థను 44 బిలియన్ డాలర్లతో (దాదాపు రూ.3,37,000 కోట్లు) కొనుగోలు చేసేందుకు మస్క్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. షేరుకు రూ.54.20 ధరను ట్విట్టర్ షేర్హోల్డర్లకు మస్క్ చెల్లించనున్నారు. ఈ విక్రయ లావాదేవీ పూర్తయిన తర్వాత ట్విట్టర్ పూర్తిగా ప్రైవేటు కంపెనీగా మారుతుంది. ఈ వార్త నేపథ్యంలో అమెరికా మార్కెట్లో ట్విట్టర్ షేరు 6 శాతంపైగా పెరిగి 52 డాలర్ల వద్దకు చేరింది. ‘వాక్ స్వాతంత్య్రానికి’ వేదికగా ట్విట్టర్ నిలబడటం లేదని భావించడం వల్లే తాను ఆ సంస్థను కొనుగోలు చేసి, ప్రైవేటు కంపెనీగా మార్చాలనుకుంటున్నానని మస్క్ 10 రోజుల క్రితం ట్విట్టర్ షేర్హోల్డర్లకు ఆఫర్ ప్రకటించిన సందర్భంగా తెలిపారు.
ఏ దిశలో వెళుతుందో తెలియదు
– సీఈవో పరాగ్ అగర్వాల్
కొత్త యజమాని ఎలాన్ మస్క్ స్వీకరించిన తర్వాత ట్విట్టర్ ఏ దిశలో వెళుతుందో తనకు తెలియదని కంపెనీ సీఈవో భారత సంతతికి చెందిన సీఈవో పరాగ్ అగర్వాల్ నిర్వేదంగా అన్నారు. మస్క్ ఒప్పందం ఖరారైన తర్వాత…ఆందోళన చెందుతున్న ఉద్యోగులతో ఆయన మాట్లాడుతూ ‘ఈ క్షణంలో మనం ఎప్పటిలానే ట్విట్టర్ను నడుపుదాం. నిర్ణయాలు తీసుకుందాం. సానుకూల మార్పులు చేపడదాం’ అంటూ ఉద్భోధ చేశారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది. కంపెనీకి నేతృత్వం వహించడానికి మస్క్ ఎవర్ని ఎంచుకుంటారు? సంస్థ సర్వీసుల నిర్వహణలో ఆయన ఎలా పాలుపంచుకుంటారు? అనే అంశాలపై ఇంకా స్పష్టత లేదని, మస్క్ లావాదేవీ ముగిసేంతవరకూ అగర్వాల్ ఇన్ఛార్జ్గా కొనసాగుతారని న్యూయార్క్ టైమ్స్ రాసింది. ఒప్పందాన్ని ట్విట్టర్ డైరెక్టర్ల బోర్డు ఇప్పటికే ఆమోదించగా, షేర్హోల్డర్లు, నియంత్రణా సంస్థల అనుమతులు లభించాల్సి ఉంది.
మస్క్కు పూర్తి మద్దతు
ఎలాన్ మస్క్ ట్విట్టర్ను కొనుగోలు చేయడంతో ఈ వెబ్సైట్ సరైన దిశలో వెళుతుందన్న ఆశాభావాన్ని ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ వ్యక్తం చేశారు. మస్క్కు తన పూర్తి మద్దతు ఉంటుందంటూ డోర్సీ ట్వీట్ చేశారు. విశ్వసనీయమైన ప్లాట్ఫామ్గా మార్చాలన్నది ఎలాన్ లక్ష్యమన్నారు. పరాగ్ (ప్రస్తుత సీఈవో) లక్ష్యం కూడా అదేనన్నారు.
ట్విట్టర్ చాలా బోరింగ్
ట్విట్టర్ను టెస్లా సీఈవో కొన్నప్పటికీ ఆ ప్లాట్ఫామ్లో మళ్లీ చేరకూడదని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నారు. మస్క్ తో ఒప్పందాన్ని కంపెనీ ప్రకటించిన తర్వాత ట్రంప్ తన నిర్ణయాన్ని ఫాక్స్ న్యూస్ ఛానల్కు వెల్లడిస్తూ‘ట్విట్టర్ చాలా బోరింగ్గా మారిపోయింది. వారు ట్విట్టర్ నుంచి చాలా మంచి గొంతుల్ని తొలగించారు’ అని వ్యాఖ్యానించారు. మస్క్ ట్విట్టర్ను మెరుగుపరుస్తాడని తాను భావిస్తున్నానని, అయితే ట్విట్టర్కు బదులు ఇకముందు తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ట్రూత్ సోషల్’ను మాత్రమే ఉపయోగిస్తానన్నారు.
ట్విట్టర్
మొత్తం ఆస్తులు – 14.06 బిలియన్ డాలర్లు
కేంద్ర కార్యాలయం – శాన్ఫ్రాన్సిస్కో, అమెరికా
వ్యవస్థాపకులు – జాక్ డోర్సీ, బిజ్ స్టోన్, ఇవాన్ విలియమ్స్, నోవాగ్లాస్
ప్రారంభ సంవత్సరం – 2006
లిస్టయిన సంవత్సరం – 2013
వార్షిక ఆదాయం – 5.08 బిలియన్ డాలర్లు
మార్కెట్ విలువ – 39.4 బిలియన్ డాలర్లు
ఉద్యోగుల సంఖ్య – 7,500
యూజర్ల సంఖ్య – 21.7 కోట్లు
భారత్లో యూజర్లు – 2.36 కోట్లు