న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16:పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ రంగ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ)కు చెందిన టోల్ వసూళ్ల అనుబంధ సంస్థ ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్ఎంసీఎల్) షాకిచ్చింది. ఫాస్టాగ్ను జారీచేసే బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ను తొలగించింది. జాతీయ రహదారులను వినియోగించే వాహనదారులకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ద్వారా ఫాస్టాగ్ సేవలు ఇకపై అందబోవని, అంతరాయం లేని ప్రయాణం కోసం ఇతర బ్యాంకుల నుంచి ఫాస్టాగ్ను కొనుగోలు చేయాల్సిందిగా వారికి ఐహెచ్ఎంసీఎల్ సూచించింది. ఈ మేరకు ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేసింది.
దేశంలో ప్రస్తుతం 8 కోట్లకుపైగా ఫాస్టాగ్ వినియోగదారులున్నారు. వీరిలో దాదాపు 30 శాతం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లేనని ఎన్హెచ్ఏఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాగా, ఈ ఏడాది జనవరి 31న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఖాతాల్లో, వ్యాలెట్లలో, ఫాస్టాగ్లలో డిపాజిట్లు లేదా టాప్-అప్లను అంగీకరించరాదని స్పష్టం చేసింది. అయితే ఇంతకన్నా ముందే జనవరి 19న కొత్తగా ఫాస్టాగ్లను జారీ చేయకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఐహెచ్ఎంసీఎల్ నిషేధం విధించడం గమనార్హం. ఇదిలావుంటే ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం కొత్త ఫాస్టాగ్ కోసం కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ యూజర్లకు ఐహెచ్ఎంసీఎల్ స్పష్టం చేసింది. ఫాస్టాగ్ అనేది భారత్లో ఓ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్. దీన్ని ఎన్హెచ్ఏఐ నిర్వహిస్తున్నది. జాతీయ రహదారులపై ప్రయాణిస్తున్నప్పుడు టోల్ ప్లాజాల వద్ద వాహనదారుల నుంచి నేరుగా టోల్ చార్జీలను రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా ఈ సిస్టమ్లో వసూలు చేస్తారు. వాహనాలు ఆగాల్సిన పని ఉండదు. దీనివల్ల ట్రాఫిక్ జామ్ సమస్యలు తప్పుతాయి.
ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో వన్97 కమ్యూనికేషన్స్ పేటీఎం నోడల్ అకౌంట్ను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి యాక్సిస్ బ్యాంక్కు మార్చింది. పేమెంట్ యాప్ పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ అన్నది తెలిసిందే. కాగా, లావాదేవీలకు ఎటువంటి ఆటంకం రాకూడదనే ఈ నిర్ణయానికి వచ్చినట్టు చెప్తున్నారు. దీంతో మార్చి 15 తర్వాత కూడా పేటీఎం క్యూఆర్, సౌండ్బాక్స్, కార్డ్ మెషీన్ వినియోగం ఎప్పట్లాగే కొనసాగగలదని, కస్టమర్లు, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బంది రాదని అంటున్నారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి తమ నోడల్ అకౌంట్ను ఇతర బ్యాంకుల్లోకి మార్చుకుంటే పేటీఎం క్యూఆర్ కోడ్, పేటీఎం సౌండ్బాక్స్ లేదా పేటీఎం పీవోఎస్ టర్మినల్స్ మార్చి 15 తర్వాత కూడా కొనసాగుతాయని ఆర్బీఐ చెప్పింది. ఈ క్రమంలోనే యాక్సిస్ బ్యాంక్కు మార్చారు. ఫలితంగా పేటీఎం కస్టమర్లు, మర్చంట్లు పేటీఎం యాప్పై మునుపటిలాగే లావాదేవీలను చేసుకోవచ్చు.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు ఐహెచ్ఎంసీఎల్ షాకిచ్చినా.. ఆర్బీఐ ఊరటనిచ్చింది. కస్టమర్లకు ఇతర బ్యాంకుల్లోకి మారేందుకున్న గడువును 15 రోజులు పొడిగించింది. నిజానికి ఈ నెలాఖరుతోనే ఈ గడువు ముగిసిపోనుండగా, మార్చి 15 వరకు పెంచుతున్నట్టు శుక్రవారం ఆర్బీఐ ప్రకటించింది. కస్టమర్లు, మర్చంట్లు తమ ఖాతాలను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి ఇతర బ్యాంకుల్లోకి మార్చుకోవాలని సూచించింది. డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలకూ ఇది వర్తిస్తుందని పేర్కొన్నది. ఖాతాదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే ఈ గడువు పెంపు అని ఈ సందర్భంగా ఆర్బీఐ తెలియజేసింది. ఈ నెల 29 తర్వాత సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లు, కరెంట్ అకౌంట్లు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డులు, ప్రీ-పెయిడ్ సాధనాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్లలో డిపాజిట్లను, టాప్-అప్లను కస్టమర్ల నుంచి తీసుకోరాదని ఆర్బీఐ ఇప్పటికే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు స్పష్టం చేసిన సంగతి విదితమే. అయితే ఈ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న నగదును ఎప్పుడైనా వాడుకోవచ్చంటూ అందుకు అనుమతినిచ్చింది. ఈ క్రమంలోనే నగదు బదిలీ, యూపీఐ సేవల్ని వినియోగించుకోవచ్చన్నది. మొత్తానికి ‘మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు లింకైన ఖాతాల్లో నగదు జమ కాదు. కావున పేటీఎం యాప్ ద్వారా ఈ బ్యాంక్లోని తమ ఖాతాల్లో కొనుగోలుదారుల చెల్లింపులను జమ వేసుకుంటున్న వ్యాపారులు.. ఇప్పుడే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి’ అని ఆర్బీఐ తాజాగా సూచించింది.