న్యూఢిల్లీ, జూలై 21: పసిడి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు భారీగా తగ్గడంతో దేశీయ కొనుగోలుదారులకు ఊరట లభిస్తున్నది. ఇప్పటికే భారీగా తగ్గిన బంగారం ధర గురువారం మరింత దిగొచ్చింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.480 తగ్గి రూ.50 వేల దిగువకు రూ.49,830కి పడిపోయింది.
అంతకుముందు ఇది రూ.50,300గా ఉన్నది. పసిడితోపాటు వెండి ధర రూ.1,260 తగ్గి రూ.54,350కి చేరుకున్నది. అటు హైదరాబాద్లోనూ 24 క్యారెట్ల తులం పసిడి రూ.440 తగ్గి రూ.50,180కి, 22 క్యారెట్ల ధర రూ.400 దిగి రూ.46 వేలకు పరిమితమైంది. కిలో వెండి మాత్రం రూ.61 వేలుగా ఉన్నది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,689 డాలర్లకు పడిపోగా, వెండి 18.42 డాలర్లుగా ఉన్నది.