Sunil Mittal-Paytm | ఇండియన్ టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ అధినేత సునీల్ మిట్టల్.. ప్రముఖ ఫిన్టెక్ కంపెనీ పేటీఎంలో వాటా కొనుగోలు చేస్తున్నారు. భారతీ ఎయిర్టెల్ అనుబంధ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ను పేటీఎంలో విలీనం చేస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల కథనం. దీని ప్రకారం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లోకి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు వాటాలు మళ్లిస్తారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో ఇతర వాటాదారులతో కూడా వాటాలు కొనుగోలు చేయిస్తారని సమాచారం. ఈ అంశంపై చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని ఎయిర్టెల్, పేటీఎం వర్గాలు తెలిపాయి. దీనిపై అధికారికంగా స్పందించడానికి ఆ రెండు సంస్థల ప్రతినిధులు నిరాకరించారు. ఈ వ్యవహారంపై స్పందించడానికి సునీల్ మిట్టల్ సారధ్యంలోని భారతీ ఎంటర్ప్రైజెస్ అధికార ప్రతినిధి ముందుకు రాలేదు.
పేటీఎం పేరెంట్ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేర్లు గత నవంబర్లో రికార్డు పతనం నుంచి 40 శాతం పుంజుకుని లాభాల్లోకి అడుగు పెడుతున్నట్లు సంకేతాలు వచ్చాయి. కస్టమర్ల నుంచి వచ్చిన రెవెన్యూతో డిసెంబర్ త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో నష్టాల నుంచి తప్పించుకోగలిగిందని ఈ నెల ఎక్స్చేంజ్ ఫైలింగ్లో వెల్లడించింది.
తమ సంస్థ పూర్తిగా వృద్ధిపైనే ఫోకస్ చేసిందని, ఇతర సంస్థల్లో విలీనం చర్చల్లో పాల్గొనడం లేదని ఈ-మెయిల్కు ఇచ్చిన సమాధానంలో పేటీఎం పేర్కొంది. ఒకప్పుడు అత్యంత విలువైన స్టార్టప్ కంపెనీగా ఉన్న పేటీఎం.. 2021లో ఐపీవో ద్వారా స్టాక్ మార్కెట్లలో లిస్టయిన తర్వాత రూ.2150 మార్క్ దాటలేదు. ఏడాది గడువు దాటిన తర్వాత సంస్థ షేర్ భారీగా నష్టపోయింది.