న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ రాణించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.1,588 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన లాభంతో పోలిస్తే 91.5 శాతం అధికమని పేర్కొంది. సమీక్షకాలంలో సంస్థ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 20 శాతం ఎగబాకి రూ.35,804 కోట్లు ఆర్జించింది.
టెలికం రంగంలో పోటీ పెరిగినప్పటికీ అన్ని విభాగాల్లో రాణించినట్లు భారతీ ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ తెలిపారు. వరుస త్రైమాసికాల్లో ఆదాయం 3.7 శాతం అధికమైంది. గత త్రైమాసికంలో కొత్తగా 64 లక్షల మంది 5జీ కస్టమర్లు చేరడం కూడా సంస్థకు కలిసొచ్చింది. అలాగే ఒక్కో కస్టమర్పై వచ్చే ఆదాయం రూ.193కి చేరుకున్నట్లు చెప్పారు.