న్యూఢిల్లీ, జనవరి 24: వినియోగదారులకు భారతీ ఎయిర్టెల్ షాకిచ్చింది. కనీస నెలసరి రీచార్జ్ ధరను ఏకంగా 57 శాతం పెంచింది. దీంతో దేశవ్యాప్తంగా 8 సర్కిళ్లలో 28 రోజుల మొబైల్ ఫోన్ సర్వీస్ ప్లాన్ ఖరీదు రూ.99 నుంచి రూ.155కు చేరింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, ఉత్తరప్రదేశ్ పశ్చిమ, జమ్ముకశ్మీర్, రాజస్థాన్, హిమాచల్ప్రదేశ్, ఈశాన్య రాష్ర్టాల్లో ధరలు పెరిగాయి. ఫలితంగా తెలంగాణలోనూ కస్టమర్లపై భారం పడింది. కాగా, రూ.99 ప్లాన్లో 200 మెగాబైట్ డాటా, కాల్స్ చార్జీ సెకనుకు 2.5 పైసలు ఉండేది. అయితే దీని ధరను ఇప్పుడు రూ.155కు పెంచిన ఎయిర్టెల్.. కస్టమర్లకు అపరిమిత కాల్స్, 1 జీబీ డాటా, 300 ఎస్ఎంఎస్లను అందిస్తున్నది. టారీఫ్ల పెంపు తొలుత హర్యానా, ఒడిషాల్లో జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మరో 8 సర్కిళ్లకు ఎయిర్టెల్ వర్తింపజేసింది. త్వరలోనే దేశంలోని అన్ని రాష్ర్టాల్లోనూ ధరలు పెరగనున్నాయంటున్నారు. మొత్తానికి రూ.155కు దిగువన ఉన్న అన్ని 28 రోజుల కాలింగ్, డాటా, ఎస్ఎంఎస్ ప్లాన్లకు ఎయిర్టెల్ స్వస్తిపలికే అవకాశాలున్నట్టు చెప్తున్నారు. దీంతో నెలసరి ప్లాన్లో ఎస్ఎంఎస్ సర్వీసులను పొందాలన్నా రూ.155తో రీచార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి కస్టమర్లకు ఏర్పడనున్నది.