Airtel fundrising | ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దేశీయ టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ కొత్తగా రూ.21 వేల కోట్ల నిధులను సేకరించాలని నిర్ణయించింది. ప్రస్తుత వాటాదారులకు రైట్స్ ఇష్యూ జారీ ద్వారా ఈ నిధులు జారీ చేయడం ద్వారా ఈ నిధులు సేకరిస్తుంది. షేర్ ముఖ విలువ రూ.5 చొప్పున ఈక్విటీ షేర్ విలువ రూ.535 ప్రాతిపదికన రైట్స్ ఇష్యూ జారీ చేయనున్నది.
రైట్స్ ఇష్యూ ప్రకారం ప్రస్తుతం ఎయిర్టెల్ వాటాదారులు తమ వాటాలకు అనుగుణంగా 25 శాతం అదనంగా నిధులు చెల్లించాల్సి ఉంటుంది. 14 ఈక్విటీ షేర్లు గల ప్రతి అర్హత గల వాటాదారుకు ఒక ఈక్విటీ షేర్ను ఎయిర్టెల్ కేటాయిస్తుంది. అయితే, షేర్లపై రైట్స్ ఇష్యూను ఏ వాటాదారుడైనా తిరస్కరించవచ్చు. దానికి ప్రత్యామ్నాయంగా మరో సబ్స్క్రైబర్ కొనుగోలు చేసేందుకు వెసులుబాటు కల్పించవచ్చు. రైట్స్ ఇష్యూ జారీ చేయడానికి డైరెక్టర్ల ప్రత్యేక కమిటీని ఎయిర్టెల్ యాజమాన్యం నియమించింది.
ఇప్పటికే భారతీ ఎయిర్టెల్లో పెట్టుబడులు పెట్టే విషయమై గూగుల్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. గతేడాది రిలయన్స్ జియోలో భారీగా గూగుల్ పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే.