న్యూఢిల్లీ : టెక్ కంపెనీలు మాస్ లేఆఫ్స్కు తెగబడుతుండటంపై భారత్పే సహ వ్యవస్ధాపకులు అష్నిర్ గ్రోవర్ స్పందించారు. టెక్ ప్రపంచంలో జరుగుతున్న లేఆఫ్స్ను తాను సమర్ధించనని, కొలువుల కోతకు బదులు వేతనాల్లో కోత విధించాలని టెక్ కంపెనీలకు సూచించారు. మార్కెట్ ప్రతికూలంగా ఉందని తాను ఎన్నడూ ఉద్యోగులను తొలగించలేదని లింక్డిన్ పోస్ట్లో గుర్తుచేశారు.
ప్రతిరోజూ ఉద్యోగుల తొలగింపు గురించి వినాల్సిరావడం బాధాకరమని, ప్రతికూల మార్కెట్ల సాకుతో తాను ఎన్నడూ ఎవరినీ ఉద్యోగంలో నుంచి తొలగించలేదని, తానెప్పుడూ సముచితంగా హైరింగ్ చేపట్టేవాడినని ఆయన రాసుకొచ్చారు. మాస్ లేఆఫ్స్కు పాల్పడే బదులు ఉద్యోగుల వేతనాల్లో 25 నుంచి 40 శాతం కోత విధించాలని చెప్పారు. టెక్ కంపెనీల వ్యవస్ధాపకులు ఈ దిశగా ఎందుకు ఆలోచించరో తనకు అర్ధం కావడం లేదని అదే పోస్ట్లో ప్రస్తావించారు.
మాస్ ఫైరింగ్స్కు ప్రత్యామ్నాయంగా 25-40 శాతం వేతన కోతలను తాను సిఫార్సు చేస్తానని చెప్పారు. ఇంధనం, మూలధనం, టెక్నాలజీ అన్ని ధరలను తిరిగి లెక్కకడుతుంటే ఉద్యోగుల విషయంలో అలా ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. తన రాబోయే స్టార్టప్ ది థర్డ్ యూనికార్న్లో 50 మందికి మించకుండా ఉద్యోగులను తీసుకోవాలనే పరిమితి విధించానని చెప్పుకొచ్చారు. తన సంస్ధలో చేరే వారు కేవలం కంపెనీ నిర్మాణం, వృద్ధిపైనే దృష్టిసారించాలని వారి బాగోగులను తాను చూసుకుంటానని గ్రోవర్ రాసుకొచ్చారు.