న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: విద్యుత్ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థయైన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్)లో 5 శాతం వరకు వాటాను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) రూట్లో విక్రయించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం ప్రారంభం కానున్న ఈ వాటా విక్రయంలో షేరు ధరను రూ.254గా నిర్ణయించింది. సంస్థలో మూడు శాతం వాటాను ఉపసంహరించుకోనుండగా, మరో రెండు శాతం వాటాను గ్రీన్ షో ఆప్షన్ కింద ఆఫర్ చేస్తున్నట్టు దీపం కార్యదర్శి అరుణిష్ చావ్లా తన ఎక్స్లో పేర్కొన్నారు.
నాన్-రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఈ వాటా విక్రయం బుధవారం ప్రారంభంకానుండగా, రిటైల్ ఇన్వెస్టర్లకు మాత్రం గురువారం నుంచి ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. 5 శాతానికి సమానమైన 17.41 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా కేంద్ర ఖజానాకు రూ.4,422 కోట్ల నిధులు సమకూరనున్నాయి. మంగళవారం కంపెనీ షేరు ధర రూ.276.05 కంటే 8 శాతం తక్కువకు రూ.254కి విక్రయించనున్నది.