డిసెంబర్ 3న ప్రారంభం
న్యూఢిల్లీ, నవంబర్ 15: మూడోవిడత భారత్ బాండ్ ఈటీఎఫ్లు డిసెంబర్ 3 నుంచి జారీకానున్నాయి. డిసెంబర్ 9తో ముగిసే ఈ ఆఫర్ ద్వారా ఇన్వెస్టర్ల నుంచి రూ. 10,000 కోట్లు సమీకరించాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యమని ఉన్నతాధికారి ఒకరు సోమవారం చెప్పారు. ఇంతకంటే అధికంగా సబ్స్క్రిప్షన్లు వస్తే, ఈ మొత్తాన్ని అట్టిపెట్టుకునే గ్రీన్షూ ఆప్షన్ కూడా ఉంటుందని ఆ అధికారి తెలిపారు. ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్ అయిన ఈ భారత్ బాండ్ ఈటీఎఫ్ల ద్వారా సేకరించే నిధుల్ని ప్రభుత్వ రంగ కంపెనీల బాండ్లలో పెట్టుబడి చేస్తారు. 2019 డిసెంబర్లో భారత్ బాండ్ ఈటీఎఫ్ తొలి సిరీస్ జారీకాగా, రెండో సిరిస్ 2020 జూలైలో వచ్చింది. రెండో విడత ఇష్యూ మూడు రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యింది. ఈ ఈటీఎఫ్ల ద్వారా సేకరించిన నిధుల్ని ప్రస్తుతం ట్రిపుల్ ఏ రేటింగ్ ఉన్న ప్రభుత్వ బాండ్లలోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాగే ఈ మొత్తం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల రుణ సమీకరణ ప్రణాళిక సజావుగా సాగేందుకు, వాటి మూలధన వ్యయ అవసరాల్ని తీర్చేందుకు ఉపయోగపడతాయి. ఈ స్కీమ్కు ఫండ్ మేనేజర్గా ఎడల్వీజ్ అసెట్ మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్నది. అక్టోబర్ చివరినాటికి భారత్ బాండ్ ఈటీఎఫ్ నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ రూ. 36,000 కోట్లుగా ఉంది.
ప్రయోజనాలివీ…
భారత్ బాండ్ ఈటీఎఫ్ల ద్వారా సమీకరించే నిధుల్ని మ్యూచువల్ ఫండ్… ప్రభుత్వ కంపెనీల బాండ్లలోనే ఇన్వెస్ట్ చేయనున్నందున, పెట్టుబడికి భద్రత ఎక్కువ.
స్కీము మెచ్యూరిటీ సమయానికి రాబడి ఎంత వస్తుందో అంచనా వేసుకునే అవకాశం ఉంది. కాలపరిమితివరకూ ఈటీఎఫ్ల్ని అట్టిపెట్టుకుంటే, రాబడి అధికం.
వీటికి లాక్ ఇన్ పిరియడ్ లేదు. ఎప్పుడుకావాలంటే అప్పుడు స్టాక్ ఎక్సేంజీల్లో విక్రయించుకోవొచ్చు.
వీటిపై వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలపై ఇండెక్సేషన్తో కూడిన పన్ను ప్రయోజనం ఉంది. 20 శాతం చెల్లిస్తే చాలు.
పోర్ట్ఫోలియోలో ఏ కంపెనీల బాండ్లు వున్నాయి. స్కీము నికర ఆస్తుల విలువ (ఎన్ఏవీ) ఎంత అనేది రోజువారీగా వెల్లడిస్తారు.
విశ్లేషకుల అభిప్రాయం ఇది…
ఇండెక్సేషన్ పన్ను ప్రయోజనం కారణంగా రూ.10 లక్షల వార్షిక ఆదాయాన్ని మించి, గరిష్ఠ టాక్స్ శ్లాబ్ల్లో ఉన్నవారికి భారత్ బాండ్ ఈటీఎఫ్ ప్రయోజనకరమని బజాజ్ క్యాపిటల్ గ్రూప్ డైరెక్టర్ అనిల్ చొప్రా అన్నారు.