Best Financial plans | ప్రతి ఒక్కరూ తమ పిల్లల కెరీర్, భవిష్యత్పై గంపెడాశలు పెట్టుకుంటారు. మెరుగైన భవిష్యత్ అందించాలంటే డబ్బులు పెట్టుబడి కూడా పెట్టాలి.. అందుకు పర్ఫెక్ట్ ప్లానింగ్ కూడా ఉండాలి. అబ్బాయ్లైతే మంచి కోర్సులు చదివిస్తే చాలు.. అమ్మాయిలను మంచి కోర్సులు చదివించడంతోపాటు పెండ్లి చేయాల్సి ఉంటుంది. కనుక పిల్లల చదువులు, పెండ్లిండ్లకు అవసరమైన నిధులు సమకూర్చి పెట్టుకోవాలి. అందుకోసం ప్రతి తల్లిదండ్రులు స్పష్టమైన ఫైనాన్సియల్ టార్గెట్స్తో ముందుకు సాగితే గానీ.. తమ చిన్నారుల ఆశలు.. ఆకాంక్షలు నెరవేర్చగలుగుతారు.
పెరుగుతున్న ఫీజులు, ఉన్నత విద్యా కోర్సుల ఖర్చులకు తగినంత సొమ్ము సేకరణకు ముందు నుంచి సిద్ధంగా లేకపోతే సమస్యల పాలవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రారంభంలో తక్కువ మొత్తాలతో పెట్టుబడి ప్రారంభించినా.. క్రమంగా ఆ ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకుంటూ వెళ్లాలి. ఆ ప్రణాళికలు ఎలా ఉండాలో తెలుసుకుందామా..!
సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై).. ఇది అమ్మాయిల భవిష్యత్ కోసం కేంద్ర ప్రభుత్వం డిజైన్ చేసి అమల్లోకి తెచ్చిన స్కీం. అయితే, పదేండ్ల లోపు బాలికల పేరు మీద మాత్రమే మదుపు చేయడానికి వీలవుతుంది. మీకు సమీప పోస్టాఫీసులో సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) పథకం కింద ఖాతా తెరవాలి. కనిష్టంగా ఏడాదికి రూ.250 నుంచి రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. దీనిపై 7.60 శాతం వడ్డీరేటు ఆఫర్ చేస్తున్నారు. అమ్మాయికి 18 ఏండ్లు నిండాక ఉన్నత విద్యా అవసరాల కోసం సగం డబ్బు విత్డ్రా చేయొచ్చు. పెండ్లయితే మాత్రం మొత్తం ఖాతా మూసేయొచ్చు. అంతే కాదు.. ఖాతా ప్రారంభించిన ఐదేండ్ల తర్వాత వైద్య అవసరాల కోసం ప్రీ-మెచ్యూర్డ్ (ముందస్తుగా) ఈ ఖాతా మూసివేయడానికి అనుమతి ఇస్తారు. దీనిపై ఆదాయం పన్ను చట్టం-1961లోని 80 సీ సెక్షన్ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.
15 ఏండ్ల పాటు అమల్లో ఉండే ఖాతా పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్) ఖాతా. 15 ఏండ్ల పాటు ప్రతి సంవత్సరం పీపీఎఫ్ సబ్స్క్రైబర్లు తమ ప్రీమియం చెల్లిస్తూ ఉండాలి. అతి తక్కువగా రూ.250 నుంచి అత్యధికంగా రూ.1.50 లక్షల వరకు ప్రీమియం పే చేయొచ్చు. ఐదేండ్ల తర్వాత పీపీఎఫ్ ఖాతా నుంచి వైదొలిగేందుకు నిబంధనలు అనుమతిస్తాయి. అత్యవసరమైతే నాలుగో ఏడాది నుంచి లోన్ పొందొచ్చు. ఏడో ఏడాది నుంచి పాక్షికంగా నిధులు విత్ డ్రా చేయొచ్చు. ఒకరి పేరు మీద ఒక్క ఖాతా మాత్రమే నిర్వహించొచ్చు. మైనర్ బాలల పేరు మీద కూడా ఖాతాలు నిర్వహించవచ్చు. దీనిపై కూడా ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద మినహాయింపు ఉంది.
ఉద్యోగుల వేతనం నుంచి 12 శాతం ప్రావిడెండ్ ఫండ్ (పీఎఫ్) కింద కేటాయిస్తారు. ఇది కాకుండా భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే తమ ఆర్థిక స్థితిగతులను బట్టి అదనంగా వాలంటరీ ప్రావిడెండ్ ఫండ్ (వీపీఎఫ్) కింద పొదుపు చేయొచ్చు. స్వచ్ఛందంగా ప్రావిడెండ్ ఫండ్లో మదుపు చేస్తున్నందున దీన్ని వాలంటరీ ప్రావిడెండ్ ఫండ్ (వీపీఎఫ్) అంటారు. ఇతర డిపాజిట్ పథకాల కంటే పీఎఫ్, వీపీఎఫ్ల్లోనే అత్యధికంగా 8.10 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ పథకం కింద మదుపుపై ఆదాయం పన్ను చట్టంలోని 80 సీ సెక్షన్ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు.
పిల్లలు చిన్నవారైతే.. యువ తల్లిదండ్రులు ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్)ల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. ఇప్పుడు భారత్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) కింద మదుపు చేసేవారు పెరుగుతున్నారు. పిల్లల భవిష్యత్ లక్ష్యాల కోసం లార్జ్ క్యాప్, స్థిరమైన ఆదాయం లభించే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అయితే, పిల్లల ఉన్నత విద్య అవసరాల కోసం చేసే మదుపు కనుక.. నష్టభయం లేని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక పిల్లల ఉన్నత విద్యా కోర్సుల ప్రారంభానికి రెండు లేదా మూడేండ్ల ముందే మ్యూచువల్ ఫండ్స్ నుంచి నిధులు ఉపసంహరించుకుని ఫిక్స్డ్ డిపాజిట్లలో మదుపు చేసి పెట్టుకోవాలి. తద్వారా అవసరాల ముంగిట మార్కెట్లో అనిశ్చిత వాతావరణం నుంచి బయటపడేందుకు వీలు చిక్కుతుంది. ఇక దీర్ఘకాలికంగా మదుపు చేసే మ్యూచువల్ ఫండ్స్పై మెరుగైన రిటర్న్స్ లభిస్తున్నాయి. దీనిపై అవగాహన లేని వారు.. ఫైనాన్సియల్ ప్లానర్స్ సలహాపై ముందుకెళ్లడం మంచిదని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.