Dhanteras | దీపావళి-ధంతేరాస్కు ముందు బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారట్ల తులం బంగారం ధర రూ.50 వేల మార్క్ వద్ద తచ్చాడుతున్నది. కిలో వెండి ధర రూ.56 వేల లోపే ఉంది. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) వెబ్సైట్ ప్రకారం బుధవారం (అక్టోబర్ 19) మార్కెట్లో 24 క్యారట్ల పది గ్రాముల బంగారం ధర రూ.227 తగ్గి రూ.50,135 వద్ద నిలిచింది. ధంతేరాస్తోనే దీపావళి పండుగ వేడుకలు ప్రారంభం అవుతాయి. ఈ ఏడాది ధంతేరాస్ పర్వదినానికి ప్రత్యేకత ఉంది. 178 ఏండ్ల తర్వాత తొలిసారి ధంతేరాస్ పర్వదినం రెండు రోజుల్లో వస్తున్నది. గురు, శని కాంబినేషన్తో ధంతేరాస్ పర్వదినం వస్తున్నది. త్రయోదశి తిథి శనివారం (22 అక్టోబర్) సాయంత్రం 6.02 గంటల నుంచి మొదలై మరుసటి రోజు సాయంత్రం 6.03 గంటల వరకు ఉంటుంది. లార్డ్ ధన్వంతరి ఈ నెల 23 మధ్యాహ్నం జన్మిస్తాడు. దీని ప్రకారం ధన్వంతరి పూజ ఈ నెల 23న నిర్వహిస్తారు.
ఇక దేశీయ బులియన్ మార్కెట్లో 24 క్యారట్ల తులం బంగారం ధర రూ. 50,135, 23 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 49,934, 22 క్యారట్ల తులం బంగారం ధర రూ.45,924, 18 క్యారట్ల తులం బంగారం ధర రూ. 37,601 పలికింది. మరోవైపు కిలో వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. బుధవారం మార్కెట్లో కిలో వెండి ధర రూ. 245 తగ్గుముఖం పట్టి రూ.55,765 వద్ద స్థిర పడింది. ఇంతకుముందు వెండి ధర పైపైకి దూసుకెళ్లింది.
దీపావళి పండుగ అంటే ఐదు రోజుల పాటు సాగే సంబురం. ధంతేరాస్తోనే దీపావళి వేడుక మొదలవుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాస కృష్ణపక్షం తొలి రోజు నుంచి మొదలవుతుంది. ఈ ఏడాది ధంతేరాస్ రెండు రోజులు రావడంతో బంగారం, వెండితోపాటు ముఖ్యమైన వస్తువుల కొనుగోలుకు రెండు రోజులు షాపింగ్ చేయొచ్చు. సాధారణంగా ఐదు రోజుల సాగే దీపావళి వేడుక.. ధంతేరాస్ రెండు రోజులు రావడంతో ఈ దఫా ఆరు రోజులు సాగనున్నది.
దీపావళి వేడుకల్లో తొలి రోజు జరిగే ధంతేరాస్ కార్తీక త్రయోదశి నాడు వస్తుంది. దేవతల వైద్యుడు లార్డ్ ధన్వంతరి స్వర్ణావతారంలో దర్శనం ఇస్తారు. ధంతేరాస్ రోజు బంగారం, వెండి నాణాలు లేదా జ్యువెల్లరీ ఆభరణాలు, పాత్రలు కొనుగోలు చేస్తారు. ధంతేరాస్ కొనుగోలు చేసిన వస్తువులు ఆ ఏడాదిలో 13 రెట్లు పెరుగుతాయని నమ్మకం.