న్యూఢిల్లీ, నవంబర్ 24: బ్యాంక్ రుణాలు ప్రియం అవుతాయా?.. ముఖ్యంగా వ్యక్తిగత రుణాలు భారం కానున్నాయా?.. అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల తెచ్చిన కొన్ని నిబంధనలు.. వివిధ రకాల లోన్స్ రిస్క్ వెయిటేజ్ను అమాంతం పెంచేశాయి. దీంతో ఆయా రుణాలపై వడ్డీరేట్లు 40 బేసిస్ పాయింట్ల వరకు పెరగవచ్చని బ్యాంకింగ్ వర్గాలు సంకేతాలిస్తున్నాయి. ‘ఆర్బీఐ చర్య నేపథ్యంలో బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లు అన్సెక్యూర్డ్ లోన్ల వడ్డీరేట్లను పెంచబోతున్నాయి. దీంతో రుణగ్రహీతలపై అదనపు భారం అనివార్యంగానే కనిపిస్తున్నది. ప్రధానంగా పర్సనల్ లోన్లపై కనీసం 30-40 బేసిస్ పాయింట్లు, ఇంకా చెప్పాలంటే అంతకుమించే వడ్డీరేట్లు పెరిగేందుకు వీలున్నది.’ అని ఓ బ్యాంకర్ ఓ ప్రముఖ జాతీయ మీడియాతో అన్నారు. దీనిపై బ్యాంకింగ్ రంగంలో సమాలోచనలు జరుగుతున్నాయనీ స్పష్టం చేశారు.
కరోనా ప్రభావం కారణంగా కీలక వడ్డీరేట్లను తగ్గిస్తూపోయిన రిజర్వ్ బ్యాంక్.. ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా గత ఏడాది నుంచి పెంచుతూ వచ్చిన విషయం తెలిసిందే. కేవలం ఏడాదిలోపే రెపో రేటును ఏకంగా 250 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిపిన ద్రవ్యసమీక్షలో చివరిసారిగా రెపోను 25 బేసిస్ పాయింట్లు పెంచగా, 6.5 శాతానికి చేరింది. ఇది ఐదేండ్లలో గరిష్ఠ స్థాయి కావడం గమనార్హం. దీంతో గృహ రుణాలతోపాటు పూచీకత్తు లేని వ్యక్తిగత రుణాలూ ప్రియమైపోయాయి. నిజానికి గృహ, వాహన, విద్యా, బంగారు రుణాలతో పోల్చితే పర్సనల్ లోన్లపై వడ్డీరేట్లు ఎక్కువే. కారణం వీటికి గ్యారంటీ ఉండదనే. అయితే ఆర్బీఐ వడ్డింపులతో వ్యక్తిగత రుణాలపై వడ్డీ భారం ఇప్పటికే పెరిగిపోగా.. ఇప్పుడు తాజా నిబంధనలతో మరింత పెరగబోతున్నది. ప్రస్తుతం ఆయా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలనుబట్టి.. అలాగే రుణగ్రహీతల క్రెడిట్ స్కోర్, లోన్ మొత్తాల ఆధారంగా పర్సనల్ లోన్లపై వడ్డీరేట్లు 10.50 నుంచి 25 శాతం మధ్య ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేపోమాపో 11 నుంచి 26 శాతానికి చేరవచ్చంటున్నారు. పెరిగిన వడ్డీరేట్లు ఇప్పటికే లోన్లు తీసుకున్నవారితోపాటు కొత్తగా తీసుకోబోయేవారికీ వర్తిస్తాయని అంటున్నారు.
క్రెడిట్ కార్డులు, పర్సనల్, రిటైల్ రుణాల వంటి గ్యారంటీ లేని కన్జ్యూమర్ లోన్లు విపరీతంగా పెరుగుతూపోతున్న నేపథ్యంలో బ్యాంకింగ్ రంగ ప్రయోజనాల రక్షణార్థం.. ఈ నెల 16న బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల కన్జ్యూమర్ లోన్ల రిస్క్ వెయిటేజీని ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో ఇక కన్జ్యూమర్ లోన్లను ఇవ్వాలంటే మరింత మూలధనాన్ని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు పక్కకు పెట్టుకోవాల్సి వస్తున్నది. ఆయా రుణాలపై వడ్డీరేట్లను పెంచితే తప్ప ఈ మూలధనం సమస్య రుణదాతలకు తీరేలా లేదు. అందుకే వడ్డీరేట్ల పెంపు తప్పనిసరి అని బ్యాంకర్లు అంటున్నారు. ‘మూలధనాన్ని పెంచుకోవాల్సి వస్తే వడ్డీరేట్ల పెంపు తప్పనిసరే’ అని ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖారా ఇప్పటికే స్పష్టం చేశారు. మరికొన్ని బ్యాంక్ చీఫ్లూ ఇదే మాట చెప్తున్నారు.
ప్రస్తుతం పర్సనల్ లోన్స్పై ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో వార్షిక వడ్డీరేట్లు.. 3 నెలల నుంచి 6 ఏండ్ల కాలపరిమితి ఆధారంగా 10.50 నుంచి 25 శాతంగా ఉన్నాయి. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్లో 10.50 నుంచి 16 శాతంగా ఉంటే.. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో ప్రారంభ రేటు 10.55 శాతంగా ఉన్నది. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)లో 12.40 నుంచి 17.45 శాతంగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వ్యక్తిగత రుణాలు 15.5 శాతం పెరిగి రూ.1.78 లక్షల కోట్లకు చేరాయి. ఐసీఐసీఐ బ్యాంక్లోనూ 40 శాతం ఎగిసి రూ.1.04 లక్షల కోట్లను తాకాయి. అంతేగాక బ్యాంక్ క్రెడిట్ కార్డు పోర్ట్ఫోలియో కూడా 29.5 శాతం ఎగిసి రూ.43,230 కోట్లకు చేరింది. కొటక్ మహీంద్రా బ్యాంక్ అన్సెక్యూర్డ్ రుణాల వ్యాపారం సైతం 50 శాతం ఎగబాకి రూ.38,311 కోట్లను చేరింది. ఈ ఏడాది అక్టోబర్లో నిర్వహించిన ద్వైమాసిక ద్రవ్యపరపతి సమీక్షలో దీనిపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆందోళననూ వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ అంశంపై సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, లేకపోతే సంక్షోభం ముప్పు తప్పదనే నిర్ణయానికి వచ్చారు. ఫలితంగానే కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.