న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ డబ్బు ప్రవాహం కరువై కటకటలాడుతున్నది. బ్యాంకుల్లో లిక్విడిటీ (ద్రవ్యత) గత 40 నెలల్లో తొలిసారిగా లోటులోకి వెళ్లిపోయినట్టు రిజర్వ్బ్యాంక్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో మంగళవారం రూ.21,800 కోట్ల నిధుల్ని బ్యాంకింగ్ వ్యవస్థలో ఆర్బీఐ ప్రవేశపెట్టింది. ఇంత మొత్తం బ్యాంక్లకు ఒకే రోజున సమకూర్చడం 2019 మే నెల తర్వాత ఇదే ప్రథమం. లిక్విడిటీ కొరత కారణంగా ఒక రోజు ఓవర్నైట్ కాల్ మనీ రేటు (బ్యాంకులు పరస్పరం నిధుల్ని ఇచ్చిపుచ్చుకునే వడ్డీ రేటు) 5.85 శాతానికి ఎగబాకింది. ఆర్బీఐ రెపో రేటును మించిపోయింది. 2019 జూలై తర్వాత ఇంతటి గరిష్ఠానికి చేరడం ఇదే తొలిసారి. కరెన్సీ నోట్ల చలామణీ పెరగడం, రుణాలు వృద్ధిచెందడంతో ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో బ్యాంకింగ్ వ్యవస్థ లోటు లిక్విడిటీతో సతమతమవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మందకొడిగా ప్రభుత్వ వ్యయం
పండుగుల సీజన్ ప్రారంభమవుతున్నందున నగదుకు డిమాండ్ పెరుగుతుందని క్వాంట్ఎకో రీసెర్చ్ ఎకానమిస్ట్ వివేక్ కుమార్ తెలిపారు. దీంతో సర్క్యులేషన్లో ఉన్న కరెన్సీ ఈ ద్వితీయార్థంలో 2.2-2.4 లక్షల కోట్ల రూపాయల మేర పెరుగుతుందని కుమార్ అంచనా వేశారు. మరోవైపు పన్ను వసూళ్లు జోరుగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం చేసే వ్యయం అంచనాలకంటే తక్కువగా ఉంటుందని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఎకానమిస్ట్ గౌరవ్సేన్ గుప్తా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వద్ద నగదు మిగులు తక్కువగా ఉన్నందున, పన్ను వసూళ్లు బాగున్నా, తగినంత వ్యయపర్చలేని పరిస్థితి ఏర్పడిందని గుప్తా తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభనెల ఏప్రిల్లో బ్యాంకుల వద్ద రూ.8 లక్షల కోట్ల మిగులు ఉంది. క్రమేపీ ఆ మిగులు పోను ఈ సెప్టెంబర్ 20 నాటికి బ్యాంకింగ్ వ్యవస్థలో రూ.21,800 కోట్ల లోటు ఏర్పడింది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ (బీవోపీ, విదేశాలకు చేసే చెల్లింపులు, స్వీకరించే మొత్తం మధ్య వ్యత్యాసం) నెగిటివ్గా మారడం లిక్విడిటీని చాలావరకూ దెబ్బతీసిందన్నారు. 2022 మార్చినాటికి 16 బిలియన్ డాలర్ల లోటుతో భారత్ బీవోపీ ఉంది. ఇది వచ్చే కొద్ది త్రైమాసికాల్లో మరింత విస్త్రతమవుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు రూపాయి పతనాన్ని నిరోధించడానికి, బీవోపీ లోటును ఎదుర్కోవడానికి రిజర్వ్బ్యాంక్ మార్కెట్లో డాలర్లను విక్రయించి, రూపాయి లిక్విడిటీని తీసేసుకోవడం కూడా కొరతకు మరో కారణమని విశ్లేషకులు చెప్పారు. ఈ ఏడాది జనవరి- జూలై మధ్యకాలంలో విదేశీ మారక నిల్వల నుంచి రిజర్వ్బ్యాంక్ 39 బిలియన్ డాలర్లను విక్రయించింది. సెప్టెంబర్ 9 నాటికి ఈ నిల్వలు 551 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. బీవోపీ మెరుగుపడేంతవరకూ వ్యవస్థలో లిక్విడిటీ కొరత కొనసాగుతుందని ఇండియా రేటింగ్స్ డైరెక్టర్ సౌమ్యజిత్ నియోగి చెప్పారు. ద్రవ్య విధానాన్ని కఠినతరం చేస్తున్న ప్రస్తుత తరుణంలో బ్యాంక్ల వద్దనున్న ప్రభుత్వ బాండ్లను ఆర్బీఐ కొనుగోలు చేసి, బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ పెంచే అవకాశాలు తక్కువని కుమార్, సేన్గుప్తాలు తెలిపారు.