RBI | ముంబై, ఏప్రిల్ 17: ఒక్క ఈఎంఐ మిస్సయితే చాలు..పెనాల్టీ పేరుతో భారీ చార్జీలను బ్యాంక్లు బాదేస్తుంటాయ్. పెనాల్టీ అనేది రుణగ్రస్తుల్లో చెల్లింపు క్రమశిక్షణ కోసం విధించే అపరాధ రుసుములా ఉండాలి తప్ప, వడ్డీ మీద వడ్డీ గుంజేస్తూ చక్రవడ్డీ తరహాలో వుండకూడదంటూ రిజర్వ్బ్యాంక్ తాజాగా రుణ వితరణ విధానాలపై ముసాయిదా మార్గదర్శకాల్ని విడుదల చేసింది. ఆయా రుణాలపై వర్తించే వడ్డీ రేటుకంటే మించి అపరాధ వడ్డీ విధింపు తగదని ముసాయిదా సర్క్యులర్ స్పష్టం చేసింది. ముసాయిదా మార్గదర్శకాలపై వివిధ భాగస్వాముల (రుణగ్రస్తులు, రుణదాతలు, పబ్లిక్) అభిప్రాయాల్ని మే 15కల్లా తెలియపర్చాలని ఆర్బీఐ కోరింది. ఇటు రుణగ్రస్తులు, అటు రుణ దాతల ప్రయోజనాల్ని సమతౌల్యం చేసేవిధంగా ఈ మార్గదర్శకాలు ఉన్నాయని నిపుణులు వ్యాఖ్యానించారు. వీటిని అమలు చేయడంవల్ల బ్యాంక్ లేదా రుణదాత పట్ల రుణగ్రస్తుడి విశ్వాసం పెంపొందుతుందని ఇండియాలెండ్స్ సీఈవో గౌరవ్ చొప్రా చెప్పారు.
సర్క్యులర్ వివరాలు..
☞ రుణగ్రస్తుడు చెల్లింపులో డిఫాల్ట్ అయినా, మంజూరైన రుణ వినియోగంలో ఒప్పందపు నిబంధనలు పాటించకపోయినా.. పలు నియంత్రిత సంస్థలు (ఆర్ఈలు-బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు) రుణాలపై వర్తించే వడ్డీ రేట్లపై పెనాల్టీ వడ్డీ రేట్లను విధిస్తున్నాయి
☞ ‘పెనాల్టీ వడ్డీ/చార్జీల ఉద్దేశ్యం రుణగ్రస్తులు చెల్లింపు క్రమశిక్షణ పాటించడానికి, రుణదాతకి తగిన పరిహారం అందడానికి మాత్రమే. కానీ సంస్థలు వాటి ఆదాయాన్ని పెంచుకునే సాధనంగా పెనాల్టీ పేరుతో అధిక వడ్డీ వసూళ్లకు పాల్పడుతున్నాయి’. దీంతో ఖాతాదారుల ఫిర్యాదులు, వివాదాలు తలెత్తుతున్నాయి.
☞ ఈ నేపథ్యంలో ఒప్పందపు వడ్డీ రేటు అమలు, వడ్డీ రేటు మార్చడానికి ఏర్పడిన పరిస్థితుల్ని పర్యవేక్షించాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఆర్ఈలు అదనపు వడ్డీ రేటును విధించరాదని తెలిపింది.
☞ ఖాతాదారు డిఫాల్ట్కావడం లేదా రుణ కాంట్రాక్టు షరతుల్ని పాటించకపోవడంతో పెనాల్టీ విధించాల్సివస్తే..దానిని ‘అపరాధ చార్జీలు’గానే పరిగణించాలి తప్ప ‘అపరాధ వడ్డీ’గా వసూలు చేయకూడదు. అపరాధ వడ్డీ కారణంగా రుణంపై వర్తించే వడ్డీ రేటు పెరుగుతుంది.
☞ పెనాల్టీ చార్జీలపై మళ్లీ వడ్డీ వేయకూడదు. దీంతో రుణ ఖాతాలో వడ్డీ భారం పెరిగిపోతుంది.
☞ రుణగ్రస్తుడి పరపతి రిస్క్ పెరిగినట్లయితే, రుణ ఒప్పందంలో షరతులు, పరిస్థితులకు అనుగుణంగా క్రెడిట్ రిస్క్ ప్రీమియంను మార్చుకునే స్వేచ్ఛ ఆర్ఈలకు ఉంటుంది.
☞ ఖాతాదారులకు ఆర్ఈలు వాయిదా చెల్లింపుల రిమైండర్లు పంపేటపుడు అందుకు వర్తించే పెనాల్టీ చార్జీలను సైతం తెలియపర్చాలి.
☞ తుది సర్క్యులర్ జారీ అయిన తర్వాత ఈ మార్గదర్శకాలు అమలులోకి వస్తాయి. వీటికి తగినట్టుగా ఆర్ఈలు వాటి విధానాల్ని రూపొందించుకుని, నిర్ణీత తేదీ నుంచి అమలు చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆర్బీఐ కోరింది.
☞ పై ఆదేశాలు క్రెడిట్ కార్డ్లకు వర్తించవు.