హైదరాబాద్, నవంబర్ 30: ప్రముఖ ఫిన్టెక్ స్టార్టప్ బ్యాంకిట్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో బలోపేతం కావడానికి ఈ ఆర్థిక సంవత్సరం (2021-22)లో లక్షకుపైగా కిరాణ స్టోర్లతో టై-అప్ పెట్టుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నది. నిత్యావసరాల దుకాణాలతోపాటు మెడికల్ స్టోర్లు, రిచార్జ్ షాపుల వంటి స్థానిక ఔట్లెట్లన్నింటితోనూ జట్టు కడుతామని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. రెండు తెలుగు రాష్ర్టాల్లో సంస్థకు అనుబంధంగా 17,500లకుపైగా ఔట్లెట్లున్నాయి. ఇందులో 50 శాతానికిపైగా గ్రామాలు, పట్టణాల్లోనే ఉన్నాయి. మరింత మంది కస్టమర్లకు చేరువ కావాలనే ఉద్దేశంతో ఆన్లైన్ చెల్లింపులకు ఊతమిస్తున్నామని, తెలంగాణలో 3,800 మైక్రో ఏటీఎంలను ఏర్పాటు చేశామని బ్యాంకిట్ సీవోవో, ఈడీ అమిత్ నిగమ్ అన్నారు. నగదు బదిలీ, నగదు ఉపసంహరణలు, ప్రీ-పెయిడ్ కార్డులు, రిచార్జ్లు, బిల్ పేమెంట్స్, బీమా, వాలెట్ రిచార్జ్లు, ట్రావెల్ బుకింగ్స్ సేవలను బ్యాంకిట్ అందిస్తున్నది.