న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సీనియర్ సిటిజన్లకు శుభవార్తను అందించింది. ప్రత్యేక డిపాజిట్ స్కీంను మరోసారి పొడిగించింది. ఎస్బీఐ ‘వీకేర్’ పేరుతో ప్రకటించిన ప్రత్యేక డిపాజిట్ స్కీంను వచ్చే ఏడాది మార్చి వరకు పొడగిస్తూ తాజాగా బ్యాంక్ నిర్ణయం తీసుకున్నది. మే 2020లో ఆరంభించిన ఈ స్కీంను పలుమార్లు బ్యాంక్ పొడిగించిన విషయం తెలిసిందే.
ఐదేండ్లు, ఆపై కాలపరిమితి కలిగిన సీనియర్ సిటిజన్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీని 30 బేసిస్ పాయింట్లు అదనంగా చెల్లిస్తున్నది. ప్రస్తుతం సాధారణ ప్రజలకు ఐదేండ్ల కాలపరిమితి ఎఫ్డీపై 5.65 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది. ఈ ప్రత్యేక స్కీం కింద సీనియర్ సిటిజన్లకు 6.45 శాతం వడ్డీని చెల్లిస్తున్నది. దీంతోపాటు 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బ్యాంక్..‘ఉత్సవ్ డిపాజిట్’ స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. 6.1 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్న ఈ స్కీం వచ్చే నెల చివరి వరకు అమలులో ఉండనున్నది.