న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు ఆందోళన బాట పడుతున్నారు. ఇప్పటికే ఆయా రంగాల్లోని ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్పరం చేస్తున్న మోదీ సర్కారు.. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి బ్యాంకింగ్ రంగాన్నీ కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూస్తున్నది. ఈ క్రమంలోనే రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 16, 17 తేదీల్లో బ్యాంక్ సంఘాల ఐక్య మండలి (యూఎఫ్బీయూ) సమ్మెకు పిలుపునిచ్చింది. 9 బ్యాంక్ ఉద్యోగ సంఘాలకు యూఎఫ్బీయూ ప్రాతినిథ్యం వహిస్తున్నది. కేవలం వ్యాపార ప్రయోజనాలే కాకుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేట్పరం చేయడం దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని బ్యాంక్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021-22)గాను పార్లమెంట్లో ప్రకటించిన బడ్జెట్లో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేట్పరం చేస్తామని, వాటిల్లోని పెట్టుబడులను ఉపసంహరించుకుంటామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఐడీబీఐ బ్యాంక్లో మెజారిటీ వాటాను ఎల్ఐసీకి అమ్ముకున్న సంగతీ విదితమే. ఇక గడిచిన నాలుగేండ్లలో 14 ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేసింది. వీటన్నిటి నేపథ్యంలోనే యూఎఫ్బీయూ ఆధ్వర్యంలో రెండు రోజుల సమ్మెకు దిగుతున్నట్లు అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ మేరకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్కు యూఎఫ్బీయూ నోటీసులనూ ఇచ్చింది.
16 నుంచి బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మెకేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రెండు రోజుల ఆందోళన పిలుపునిచ్చిన బ్యాంక్ సంఘాల ఐక్య మండలి ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు-2021ను తీసుకురావాలని మోదీ సర్కారు చూస్తున్నది. ఈ సమావేశాల్లో ప్రవేశపెడుతున్న 26 బిల్లుల్లో ఇది కూడా ఒకటి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఖజానాకు రూ.1.75 లక్షల కోట్లను తరలించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ క్రమంలోనే రెండు బ్యాంకులను ప్రైవేటీకరించాలని చూస్తున్నది. ఇందుకు తగ్గట్లుగా బ్యాంకింగ్ కంపెనీస్ (అక్విజిషన్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అండర్టేకింగ్స్) చట్టాలు 1970, 1980లతోపాటు బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949కి సవరణలు చేసేలా కొత్త బిల్లును తెస్తున్నది. ఇది ఆమోదం పొందితే ఇప్పుడున్న ప్రభుత్వ బ్యాంకుల్లో రెండు కార్పొరేట్ల చేతికి వెళ్లడం ఖాయం. అయితే ఏ బ్యాంకుల్లో వాటాలను అమ్మేస్తారన్నది మాత్రం ఇంకా తెలియదు.