న్యూఢిల్లీ, జూన్ 22:దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ ఆర్థిక సేవల సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీరేటును మరోసారి పెంచింది. రూ.2 కోట్ల లోపు టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేటును 5 బేసిస్ పాయింట్లు సవరించింది. పెంచిన వడ్డీరేట్లు బుధవారం నుంచి అమలులోకి వచ్చాయని పేర్కొంది. గడిచిన ఆరు రోజుల్లో వడ్డీరేట్లను పెంచడం ఇది రెండోసారి కావడం విశేషం.
బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో 7-14, 15-29 రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును సాధారణ ప్రజలకు 2.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.25 శాతం చొప్పున చెల్లించనున్నది. అలాగే 30-45, 46-60, 61-90 రోజులలోపు డిపాజిట్లపై వడ్డీని 3.25 శాతంగాను, సీనియర్ సిటిజన్లకు 3.75 శాతంగా నిర్ణయించింది.
91-120, 121-150, 151-184 రోజుల డిపాజిట్లపై వడ్డీని 3.75 శాతం, సీనియర్ సిటిజన్లకు మాత్రం 4.25 శాతం చెల్లించనున్నది. 185-210, 211-270, 271-289, 290 రోజుల నుంచి ఏడాది లోపు కాలపరిమితి కలిగిన టర్మ్ డిపాజిట్లపై వడ్డీని 4.60 శాతం నుంచి 4.65 శాతానికి పెంచిన బ్యాంక్, సీనియర్ సిటిజన్లకు మాత్రం 5.10 శాతం నుంచి 5.15 శాతానికి సవరించింది.