Home Loans | ధరలను కట్టడి చేయడానికి ఆర్బీఐ పెంచిన రెపోరేట్కు అనుగుణంగా బ్యాంకులన్నీ వివిధ రుణాలపై వడ్డీరేట్లు పెంచేస్తే ఒక బ్యాంకు మాత్రం భిన్నంగా స్పందించింది. అది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎం). ఇండ్ల రుణాలపై వడ్డీరేట్లు 30 నుంచి 70 బేసిక్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు తెలిపింది. వడ్డీరేట్ల తగ్గింపు సోమవారం నుంచి అమల్లోకి వస్తుంది. ఇక పర్సనల్ లోన్లపై వడ్డీరేటు 245 బేసిక్ పాయింట్లు కుదించేసింది. ప్రస్తుత పండుగల సీజన్లో రిటైల్ రుణాలన్నీ కస్టమర్లకు చౌకగా అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎం) కనీసం 8 శాతం వడ్డీపై ఇండ్ల రుణాలు మంజూరు చేస్తామని తెలిపింది. ఇక వ్యక్తిగత రుణాలు 11.35% నుంచి 8.9% శాతానికి కుదించేసినట్లు పేర్కొంది. సిబిల్ స్కోర్ 800 కంటే ఎక్కువగా ఉంటే ఇంతకుముందు 8.3 శాతం వడ్డీపై ఇండ్ల రుణాలిచ్చేది. సిబిల్ స్కోర్ 700, అంత కంటే ఎక్కువగా ఉంటే 8.7% శాతం వడ్డీపై రుణాలిచ్చేది.
కానీ, ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎం) సిబిల్ స్కోర్ కనీసం 700 పాయింట్లు ఉంటే రుణ గ్రహీతలకు ఎనిమిది శాతం వడ్డీ అందిస్తుంది. ఇప్పటికే ‘దీపావళి ధమాకా’ ఆఫర్ కింద బంగారం, ఇండ్లు, కార్ల రుణాలపై బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎం) నికర వడ్డీ మార్జిన్( ఎన్ఐఎం) జూన్ త్రైమాసికంలో 3.28% సంపాదించింది. ఇతర బ్యాంకుల నికర వడ్డీ మార్జిన్ కంటే ఎక్కువ. ఎస్బీఐ గ్లోబల్ నికర వడ్డీ మార్జిన్ 2.92% అయితే, దేశీయ వడ్డీ మార్జిన్ 3.15%గా నమోదైంది.