న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) లాభాల్లో భారీ వృద్ధిని సాధించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.1,870 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,151 కోట్లతో పోలిస్తే 62 శాతం వృద్ధిని సాధించింది.
ఏడాది క్రితం మూడో త్రైమాసికంలో రూ.14,160 కోట్లుగా ఉన్న బ్యాంక్ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.16,411 కోట్లకు ఎగబాకినట్లు వెల్లడించింది. సమీక్షకాలంలో బ్యాంక్కు వడ్డీల మీద వచ్చే ఆదాయం రూ.12,728 కోట్ల నుంచి రూ.15,218 కోట్లకు చేరుకున్నది. స్థూల నిరర్థక ఆస్తుల విలువ 7.66 శాతం నుంచి 5.35 శాతానికి దిగిరాగా, నికర ఎన్పీఏ 1.61 శాతం నుంచి 1.41 శాతానికి దిగొచ్చింది. బ్యాంక్ అడెక్వసీ రేషియో 15.60 శాతం నుంచి 16.06 శాతానికి పెరిగాయి.