న్యూఢిల్లీ, జూలై 1: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశానుసారం ఆగస్టు 1 నుంచి రూ.5 లక్షలు, ఆపై విలువ కలిగిన చెక్కుల క్లియరెన్స్కు పాజిటివ్ పే సిస్టమ్ (పీపీఎస్)ను తప్పనిసరి చేస్తున్నట్టు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ప్రకటించింది. పాజిటివ్ పే ధ్రువీకరణ (పీపీఎస్లో నమోదు) లేనిపక్షంలో చెక్కులను తిరస్కరిస్తామని స్పష్టం చేసింది. మరిన్ని వివరాల కోసం ఖాతాదారులు 18002584455 టోల్ఫ్రీ నెంబర్కు కాల్ లేదా www.bankofbaroda.in వెబ్సైట్ను సందర్శించవచ్చని బీవోబీ తెలియజేసింది.
పీపీఎస్ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపొందించింది. అతి విలువైన చెక్కుల్లోని వివరాలను మరోసారి ధ్రువీకరించే ప్రక్రియే ఇది. చెక్కులను జారీచేసేవారు ఈ వివరాలను సదరు చెక్కులను క్లియర్ చేస్తున్న బ్యాంకులకు సమర్పించాల్సి ఉంటుంది. ఎస్ఎంఎస్, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ తదితర మార్గాల్లో వివరాలందించవచ్చు. నేరుగా బ్యాంక్ శాఖలకు వెళ్లి కూడా ఇవ్వవచ్చు.
ఖాతా నెంబర్, చెక్కు నెంబర్, దానిపై తేదీ, ఎవరి కోసం ఇచ్చాం, చెక్కుపై ఎంత రాశాం, లావాదేవీ కోడ్, ఎంఐసీఆర్ కోడ్లను చెప్పాల్సి ఉంటుంది. చెక్కులను క్లియర్ చేస్తున్న సమయంలో బ్యాంక్ సిబ్బంది ఈ వివరాలను పరిశీలించి, తేడాలుంటే ఖాతాదారును సంప్రదిస్తారు. చెక్కు క్లియరైందా?.. తిరస్కరణకు గురైందా?.. అన్న సమాచారం కస్టమర్లకు ఎస్ఎంఎస్ రూపంలోనూ అందుతుంది.