Bank of Baroda | న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్తో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేటును 5 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. నాలుగు నెలల తర్వాత మళ్లీ వడ్డీరేట్లను పెంచడం ఇదే తొలిసారి. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఒక్కరోజు రుణాలపై వడ్డీరేటు 8.05 శాతం నుంచి 8.10 శాతానికి చేరుకుంది. అలాగే మూడు, ఆరు, ఏడాది కాలపరిమితి రుణాలపై రేట్లను కూడా ఇంతే స్థాయిలో సవరించింది.
దీంతో మూడు నెలల రుణాలపై వడ్డీరేటు 8.45 శాతానికి చేరుకోగా, ఆరు నెలల కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేటు 8.65 శాతానికి, ఏడాది రుణాలపై రేటు 8.85 శాతానికి సవరించింది. ఈ నూతన వడ్డీరేట్లు శుక్రవారం నుంచి అమలులోకి రానున్నట్లు బ్యాంక్ ప్రతినిధి ఒకరు తెలిపారు. మరోవైపు, దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్..రెపోతో అనుసంధానమైన గృహ రుణాలపై వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్ల నుంచి 15 బేసిస్ పాయింట్ల వరకు సవరించింది. దీంతో గృహ రుణాలపై వడ్డీరేటు 9.05 శాతం నుంచి 9.8 శాతం మధ్యలోకి చేరుకున్నాయి.