న్యూఢిల్లీ, జనవరి 31: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.4,579 కోట్ల నికర లాభాన్ని గడించింది. 2022-23 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,853 కోట్ల కంటే 19 శాతం అధికంగా నమోదైనట్లు బ్యాంక్ పేర్కొంది. ఏడాది క్రితం రూ.27, 092 కోట్లుగా ఉన్న బ్యాంక్ ఆదా యం గత త్రైమాసికంలో రూ.31,416 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది.
దీంట్లో వడ్డీల మీద వచ్చే ఆదాయం రూ.23,540 కోట్ల నుంచి రూ.28,605 కోట్లకు పెరిగినట్లు వెల్లడించింది. అలాగే బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 4.53 శాతం నుంచి 3.08 శాతానికి దిగిరాగా, నికర ఎన్పీఏ 0.99 శాతం నుంచి 0.70 శాతానికి దిగొచ్చినట్లు పేర్కొంది. మరోవైపు, బ్యాంక్ క్యాపిటల్ అడెక్వసీ రేషియో 14.93 శాతం నుంచి 14.72 శాతానికి తగ్గింది. గత త్రైమాసికంలో బ్యాంక్ మొండి బకాయిలను పూడ్చుకోవడానికి కేవలం రూ.50.49 కోట్ల నిధులు మాత్రమే వెచ్చించింది.