న్యూఢిల్లీ, జూలై 30: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.2,168 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.1,208 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 79 శాతం అధికమని పేర్కొంది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.19,915.83 కోట్ల నుంచి రూ.20,119.52 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. వడ్డీల మీద వచ్చే ఆదాయం రూ.17,052.64 కోట్ల నుంచి రూ.18,937.49 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది. వడ్డీయేతర ఆదాయం కూడా ఏడాది ప్రాతిపదికన 12 శాతం ఎగబాకి రూ.8,838 కోట్లకు చేరుకున్నది.