ముంబై, డిసెంబర్ 10: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను పెంచాలని నిర్ణయించింది. అన్ని రకాల టెన్యూర్స్పై 30 బేసీస్ పాయింట్లదాకా ఈ పెంపు ఉండనున్నది. ఈ నెల 12 (సోమవారం) నుంచి కొత్త వడ్డీరేట్లు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)కు బ్యాంక్ తెలియజేసింది. అయితే గత నెలలో పెంచిన వడ్డీరేటు కంటే ఇది రెట్టింపు కావడం గమనార్హం.
నవంబర్లో 15 బేసిస్ పాయింట్ల వరకే బీవోబీ పెంచిన విషయం తెలిసిందే. కాగా, తాజా వడ్డింపుతో ఏడాది ఎంసీఎల్ఆర్ 25 బేసిస్ పాయింట్లు పెరిగి 8.3 శాతానికి చేరింది. గత నెల్లోనే ఇది 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.05 శాతానికి వచ్చింది. ఇదిలావుంటే 3 నెలల ఎంసీఎల్ఆర్ 7.75 శాతం నుంచి 8.05 శాతానికి, 6 నెలల ఎంసీఎల్ఆర్ 7.9 శాతం నుంచి 8.15 శాతానికి చేరాయి. ఓవర్నైట్ రేటు కూడా 7.25 శాతం నుంచి 7.5 శాతాన్ని తాకింది. దీంతో గృహ, వ్యక్తిగత రుణాలతోపాటు చిన్న, మధ్యతరహా సంస్థ (ఎస్ఎంఈ)లకిచ్చే రుణాలపైనా వడ్డీరేట్లు పెరగనున్నాయి. అలాగే ఈ పెంపు ప్రభావం కార్పొరేట్ రుణాలపైనా స్పష్టంగా కనిపించనున్నది. మరోవైపు రుణాలపై వడ్డీరేట్లు పెరుగుతున్న నేపథ్యంలో టర్మ్ డిపాజిట్లపైనా వడ్డీరేట్లను పెంచే దిశగా బ్యాంక్ వెళ్తున్నది. నిధుల కొరతను అధిగమించడానికి, డిపాజిట్దారులను ఆకర్షించడానికి తప్పట్లేదని బ్యాంకింగ్ వర్గాలు చెప్తున్నాయి.