న్యూఢిల్లీ, మే 10: ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) రుణాలపై వడ్డీరేట్లను పెంచింది. మంగళవారం ఎంసీఎల్ఆర్ను 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. గత వారం రెపో రేటును ఆర్బీఐ అనూహ్యంగా 40 బేసిస్ పాయింట్లు పెంచిన నేపథ్యంలోనే బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నది. దీంతో ఇప్పటికే రుణాల వడ్డీరేట్లను పెంచిన బ్యాంకుల జాబితాలో ఇప్పుడు బీవోబీ కూడా చేరినైట్టెంది. కాగా, వివిధ కాలపరిమితులపై మారిన వడ్డీరేట్లు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలోనే ఏడాది ఎంసీఎల్ఆర్ 7.35 శాతం నుంచి 7.4 శాతానికి వస్తుండగా, 3, 6 నెలల ఎంసీఎల్ఆర్లు సైతం 5 బేసిస్ పాయింట్లు అందుకుని 7.15 శాతం, 7.25 శాతంగా ఉండనున్నాయి. అలాగే ఓవర్నైట్, నెలసరి ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్ల చొప్పున పెరిగి 6.6, 7.05 శాతాలకు చేరాయి.
బజాజ్ ఫైనాన్స్ ఎఫ్డీలపై..
బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ 36-60 నెలల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై వడ్డీరేట్లను 10 బేసిస్ పాయింట్లదాకా పెంచింది. రూ.5 కోట్ల వరకు చేసే తాజా డిపాజిట్లు, మెచ్యూరింగ్ డిపాజిట్ల రెన్యువల్స్కు కొత్త వడ్డీరేట్లు వర్తిస్తాయి. మంగళవారం నుంచే ఇవి అమల్లోకి వస్తాయి. దీంతో డిపాజిట్దారులకు గరిష్ఠంగా 7 శాతం వరకు రిటర్నులు రానున్నాయి.