Bajaj CNG Bike | ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ ఆటో.. దేశీయ మార్కెట్లో త్వరలో సీఎన్జీ ఫ్యుయల్ మోటారు సైకిల్ ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నది. పెట్రోల్ ఆధారిత మోటారు సైకిళ్ల ధరలు, ఫ్యుయల్ ఖర్చుతో పోలిస్తే సీఎన్జీ ఫ్యుయల్ బైక్ చౌకగా లభిస్తుందని ఇటీవల ఓ ఆంగ్ల టీవీ చానెల్తో మాట్లాడుతూ బజాజ్ ఆటో ఎండీ కం సీఈఓ రాజీవ్ బజాజ్ చెప్పారు. పెట్రోల్ ధరలు భరించలేని వారికి ఎంట్రీ లెవల్ సీఎన్జీ ఫ్యూయల్ మోటారు సైకిల్ ఆకర్షణీయంగా ఉంటుందన్నారు.
ఎలక్ట్రిక్ మోటారు బైక్స్ మాదిరిగా సీఎన్జీ ప్యుయల్ మోటార్ సైకిళ్లతో బ్యాటరీ లైఫ్, చార్జింగ్, సేఫ్టీ వంటి ఆందోళనేదీ ఉండదని రాజీవ్ బజాజ్ వివరించారు. తాము రూపొందించే సీఎన్జీ వేరియంట్ మోటారు బైక్ వల్ల ఫ్యుయల్ ఖర్చు సగానికి సగం తగ్గిపోతుందన్నారు. మోటారు సైకిళ్లపై ప్రయాణించే వారికి ఈ బైక్ ఎంతో మంచిదన్నారు. సీఎన్జీ మోటార్ సైకిల్ ప్రణాళికను బజాజ్ ఆటో అమలు చేస్తే.. దేశంలోనూ తొలిసారి పూర్తిస్థాయిలో సీఎన్జీతో నడిచే మోటార్ సైకిల్ ఆవిష్కరించిన సంస్థగా బజాజ్ ఆటో నిలవనుంది. సీఎన్జీ త్రీ వీలర్స్ వేరియంట్ల విక్రయంలో బజాజ్ ఆటో మార్కెట్ వాటా సుమారు 70 శాతంగా ఉంది.
త్వరలో మొదలయ్యే ఫెస్టివ్ సీజన్లో ఎంట్రీ లెవల్ ఐసీఈ బైక్ విక్రయాలు పెరుగుతాయని తాను భావించలేనని రాజీవ్ బజాజ్ తెలిపారు. అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపే మొగ్గుతున్నారన్నారు. ఇదిలా ఉంటే పండుగల సీజన్ ప్రారంభంలో ట్రయంఫ్, చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రొడక్షన్ సామర్థ్యం పెంచుతున్నామని చెప్పారు. ప్రస్తుతం ట్రయంఫ్ మోటారు సైకిళ్లు 8000 యూనిట్లు ఉత్పత్తి చేస్తున్నామని, 15 నుంచి 20 వేల యూనిట్ల వరకూ వాటి ఉత్పత్తి కెపాసిటీ పెంచుతామని తెలిపారు. ఇక 10వేల బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తితో మొదలు పెట్టి.. ఈ ఏడాది చివరికల్లా 20 వేల యూనిట్లకు పెంచుతామన్నారు. అక్టోబర్ నుంచి ట్రయంఫ్ మోటారు బైక్లు విదేశాలకు ఎగుమతి చేస్తామని తెలిపారు.