న్యూఢిల్లీ, జనవరి 28: బ్యాడ్ బ్యాంక్గా వ్యవహరిస్తున్న నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్ఏఆర్సీఎల్) కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్దమయ్యింది. నియంత్రణాపరమైన అన్ని అనుమతులూ ఎన్ఏఆర్సీఎల్కు లభించాయని, ఈ సంస్థకు బదిలీ చేయడానికి ప్రస్తుతం రూ.82,845 కోట్ల విలువైన 38 మొండి బకాయిల్ని గుర్తించామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినేశ్ ఖారా చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రూ. 50,000 కోట్ల విలువైన 15 ఎన్పీఏ ఖాతాల్ని 2022 మార్చి కల్లా ఎన్ఏఆర్సీఎల్కు బదిలీ చేయడానికి బ్యాంక్లు అంగీకరించాయన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బకాయిల సమస్య పరిష్కరించడానికి ఒక బ్యాడ్ బ్యాంక్ను ఏర్పాటు చేస్తామంటూ గతేడాది బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే తొలుత గుర్తించిన ఖాతాలను ఆ సంస్థకు బదిలీ చేయడానికి ప్రక్రియలను పూర్తిచేస్తున్నామని ఎస్బీఐ చైర్మన్ తెలిపారు. రూ.2 లక్షల కోట్ల ఎన్పీఏ ఖాతాల పరిష్కారానికి ఈ బ్యాడ్ బ్యాంక్ను ఉద్దేశించారు. అంతకంటే తక్కువ మొత్తాన్ని గుర్తించడంపై ఎస్బీఐ ఎండీ స్వామినాథన్ వివరణ ఇస్తూ గతంలో రూ. 2 లక్షల కోట్లను గుర్తించామని, ఈ ఏడాదికాలంలో రూ. 83,000 కోట్ల విలువైన మొండి ఖాతాల్నే తొలుత బదిలీ చేయాలని జాయింట్ లెండింగ్ ఫోరమ్లు నిర్ణయించాయన్నారు. మిగిలిన ఖాతాలకు సంబంధించి దశలవారీగా ఈ ప్రక్రియ కొనసాగుతుందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది పూర్తవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ప్రస్తుతానికి కనీసం రూ. 50,000 కోట్ల విలువైన 15 ఖాతాల్ని బదిలీ చేయాలన్నది తమ లక్ష్యమని స్వామినాథన్ వివరించారు.
ఐడీఆర్సీఎల్కు అనుమతులు
మరో మొండి బకాయిల నిర్వహణా సంస్థ ఇండియా డెట్ రిజల్యూషన్ కంపెనీ (ఐడీఆర్సీఎల్)కి కూడా నియంత్రణాపరమైన అనుమతులన్నీ లభించినట్టు ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖారా వెల్లడించారు. ఎన్ఏఆర్సీఎల్లో ప్రభుత్వ రంగ బ్యాంక్లకు మెజారిటీ వాటా ఉంటుందని, ఐడీఆర్సీఎల్లో ప్రధాన వాటా ప్రైవేట్ బ్యాంక్ల వద్ద ఉంటుందని వెల్లడించారు. రెండు సంస్థల ఏర్పాటును ఆయన ప్రస్తావిస్తూ గుర్తించబడిన ఎన్పీఏ ఖాతాల్ని బ్యాంక్ల నుంచి ఎన్ఏఆర్సీఎల్ తీసుకుంటుందని, రుణ పరిష్కార ప్రక్రియకు రెండు పార్టీల మధ్య కుదిరిన ప్రత్యేక ఒప్పందానికి లోబడిన ఖాతాల్ని నిర్వహిస్తుందన్నారు. ఎన్ఏఆర్సీఎల్లో ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్లు ఒక్కోదానికి 13.37 శాతం చొప్పన వాటాను తీసుకోగా, 12 శాతం వాటాను పంజాబ్ నేషనల్ బ్యాంక్ పొందింది. ఎన్ఏఆర్సీఎల్కు పద్మకుమార్ నాయర్, ఐడీఆర్సీఎల్కు మనీశ్ మఖారియా నేతృత్వం వహిస్తారని ఎస్బీఐ చైర్మన్ చెప్పారు. ఎన్పీఏలో 15 శాతం నగదు, 85 శాతం సెక్యూరిటీ రీసీట్స్ను బ్యాంక్లకు చెల్లించి, ఎన్పీఏలను కొంటుంది.