Azim Premji foundation : మనదేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీ వైద్యరంగంలోకి అడుగుపెట్టనుంది. వెనబడిన నగరాల్లోని పేదవాళ్లకు వైద్య సేవల్ని అందించేందుకు అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ సిద్ధమవుతోంది. పలు చోట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. అంతేకాదు ఆ ప్రాంతాల్లో మెడికల్ యూనివర్సిటీ, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని కూడా ఏర్పాటు చేయనున్నట్టు మంగళవారం అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ తెలిపింది. ‘కరోనా సమయం నుంచి మేము ఆరోగ్యరంగంలో ప్రభావవంతంగా పని చేస్తున్నాం. మేము మరింత ముందుకు వెళ్లడానికి ఈ రంగం ఎంతో కీలకమైనది అని సీఈఓ అనురాగ్ బెహర్ ఒక ప్రకటనలో తెలిపాడు.
‘భారతేదేశవ్యాప్తంగా వైద్య సాయం అందని పేదవాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లకు వైద్యం అందించడం మీద దృష్టి పెడతాం. ప్రజలను ఆరోగ్యవంతుల్ని చేయడమే మా ప్రధాన ఉద్దేశం’ అని అనురాగ్ చెప్పాడు. ఫౌండేషన్ తరఫున ఆరోగ్యరంగానికి సంబంధించిన పనులను ఆనంద్ స్వామినాథన్ చూసుకోనున్నారు.
వచ్చే 2-3 ఏళ్లలో అన్ని వెనకబడిన నగరాల్లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, మెడికల్ యూనివర్సిటీ అందుబాటులోకి తేవాలనే ఆలోచనలో ఉంది. చదువు మీద ఎంత ఖర్చుపెడుతున్నామో వచ్చే ఐదేళ్లలో అంతే మొత్తం ఆరోగ్యం మీద కూడా అంత ఖర్చు చేస్తామని అనురాగ్ బెహర్ వెల్లడించాడు. దాదాపు 20 ఏళ్లుగా అజీమ్ ప్రేమ్జీ సంస్థ ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ఆర్థిక సాయం చేస్తోంది. వ్యాపారవేత్త అయిన అజీం ప్రేమ్జీ స్థాపించిన విప్రో దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటి.