న్యూఢిల్లీ, మార్చి 30: అంతర్జాతీయ ఫైనాన్షియల్ దిగ్గజం సిటిగ్రూప్నకు భారత్లో ఉన్న రిటైల్ వ్యాపారాన్ని ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ చేజిక్కించుకుంటున్నది. సిటిఇండియా రిటైల్ ఫైనాన్షియల్ ఆస్తుల విలువ 2 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. సిటిబ్యాంక్ ఇండియా.. క్రెడిట్ కార్డులు, రిటైల్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్మెంట్, కన్జూమర్ లోన్స్ విభాగాలతో కూడిన కన్జూమర్ బ్యాంకింగ్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నది. ఈ వ్యాపారం కొనుగోలుకు 1.6 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 12,000 కోట్లు) నగదును యాక్సిస్ బ్యాంక్ చెల్లించనున్నట్టు బుధవారం సిటి విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. తమ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) సిటిగ్రూప్ ఫైనాన్స్ వ్యాపారాన్ని సైతం యాక్సిస్కు విక్రయిస్తున్నది. ఈ ఎన్బీఎఫ్సీ వాణిజ్య వాహనాలు, నిర్మాణ పరికరాలకు రుణాలివ్వడంతో పాటు వ్యక్తిగత రుణాల పోర్ట్ఫోలియోను కూడా కలిగి ఉన్నది. అయితే భారత్లోని సంస్థాగత ఖాతాదారుల వ్యాపారం మాత్రం సిటి వద్దనే ఉంటుంది. యాక్సిస్తో సిటి లావాదేవీ తమ బ్యాంకింగ్ రిటైల్ వినియోగదారులకు మంచి అవకాశాన్ని అందిస్తున్నదని, ఇండియా తమకు కీలకమైన సంస్థాగత మార్కెట్గా కొనసాగుతుందని సిటి ఆసియా పసిఫిక్ సీఈవో పీటర్ బబెజ్ చెప్పారు. భారత్లోనూ, అంతర్జాతీయంగానూ సంస్థాగత ఖాతాదారులపై సిటి దృష్టి నిలుపుతుందన్నారు.
దేశంలో సిటి కన్జూమర్ బ్యాంకింగ్ వ్యాపార విభాగాల్లో దాదాపు 4,000 మంది ఉద్యోగులున్నారు. ప్రతిపాదిత లావాదేవీ పూర్తయిన తర్వాత ఈ ఉద్యోగుల్ని యాక్సిస్ బ్యాంక్కు బదిలీ చేస్తారు. నియంత్రణాపరమైన అనుమతులు లభించిన తర్వాత 2023 క్యాలండర్ సంవత్సరం ప్రథమార్థంలో పూర్తవుతుందని అంచనా. దేశంలో 86 లక్షల క్రెడిట్ కార్డ్ల జారీతో ఈ విభాగంలో యాక్సిస్ బ్యాంక్ నాల్గవస్థానంలో ఉంది. ఈ బ్యాంక్ రిటైల్ వ్యాపార పరిమాణం రూ.4 లక్షల కోట్లు. సిటి రిటైల్ వ్యాపారాన్ని టేకోవర్ చేసిన తర్వాత యాక్సిస్ బ్యాంక్ పొదుపు ఖాతాల సంఖ్య 2.85 కోట్లకు పెరుగుతుంది. క్రెడిట్ కార్డుల సంఖ్య 1.06 కోట్లకు చేరుతుంది. సిటిబ్యాంక్ ఇండియా రిటైల్ వ్యాపార పరిమా ణం రూ. 68,000 కోట్లుకాగా, అందులో రిటైల్ రుణాలు రూ. 28,000 కోట్లు ఉన్నాయి. సిటి బ్యాంక్ మొత్తం వ్యాపారంలో రిటైల్ వ్యాపారం మూడో వంతు ఉండగా, లాభదాయకతలో మాత్రం కార్పొరేట్ బ్యాంకింగ్ ఖాతాల ద్వారానే 80 శాతం సమకూరుతుంది. దేశంలో మొత్తం బ్యాంకింగ్ రంగం అడ్వాన్సుల్లో సిటి వాటా 0.6 శాతంకాగా, డిపాజిట్లలో వాటా 1.1 శాతం ఉంది. సిటిగ్రూప్ అంతర్జాతీయంగా ఆర్జించే లాభంలో భారత్ వ్యాపారం ద్వారా 1.5 శాతం సమకూరుతున్నది. సిటిబ్యాంక్ తొలి మహిళా సీఈవో జానే ఫ్రేజర్..13 దేశాల్లో రిటైల్ వ్యాపారాల నుంచి వైదొలగాలని గతంలో నిర్ణయించారు. అధిక లాభాల్ని ఇచ్చే వ్యాపారాల కోసం మూలధనాన్ని సంరక్షించుకోవాలన్న ప్రణాళికతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు భారత్లో సైతం రిటైల్ బ్యాంకింగ్ బిజినెస్ నుంచి వైదొలగనున్నట్టు సిటి ఇంతకు మునుపే ప్రకటించింది.
సిటిబ్యాంక్ కస్టమర్లు ప్రస్తుతం అందుకుంటున్న రివార్డులు, ఆఫర్లు, ఇతర సదుపాయాలు ఇకముందు కూడా కొనసాగుతాయని సిటి ప్రకటించింది. తమ అంతర్జాతీయ కార్యకలాపాలకు మద్దతును అందించే ఆఫ్షోర్ సెంటర్లు ముంబై, పుణె, బెంగళూరు, చెన్నై, గుర్గావ్ల్లో ఉన్న కేంద్రాలు కొనసాగుతాయని సిటి తెలిపింది. 2021 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సిటిబ్యాంక్ ఇండియా రూ.4,093 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇది రూ. 4,918 కోట్లుగా ఉంది. ఈ బ్యాంక్ స్థూల ఎన్పీఏలు రూ. 990.94 కోట్లుకాగా, నికర ఎన్పీఏలు రూ. 143.34 కోట్లు.