GO First | న్యూఢిల్లీ, జూలై 21: దివాలా ప్రక్రియలో ఉన్న గో ఫస్ట్ ఎయిర్లైన్స్ పునరుద్ధరణ ప్రణాళికను కొన్ని షరతులతో ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ ఆమోదించింది. బడ్జెట్ విమానాల్ని నడిపే గో ఫస్ట్ దివాలా పిటిషన్ వేసి మే 3 నుంచి ఫ్లైట్స్ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. నేషనల్ కంపెనీలా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) దివాలా పిటిషన్ను ఆమోదిస్తూ కంపెనీకి ఒక రిజల్యూషన్ ప్రొఫెషనల్ను (ఆర్పీ) నియమించింది.
తాజాగా 15 ఎయిర్క్రాఫ్ట్లతో 114 రోజువారీ ఫ్లైట్స్ ద్వారా కార్యకలాపాల్ని పునర్ప్రారంభిస్తామంటూ గో ఫస్ట్ ఆర్పీ డీజీసీఏకు జూన్ 28న ఒక ప్రణాళికను సమర్పించారు. తదుపరి ఎయిర్లైన్కు ముంబై, ఢిల్లీలలో ఉన్న సదుపాయాలపై రెగ్యులేటర్ ప్రత్యేక ఆడిట్ నిర్వహించింది. ఈ ప్రణాళికను అనుమతిస్తున్నట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.