Cars Exports | దేశీయంగా కార్ల విక్రయాల్లో కొత్త రికార్డులు నమోదవుతున్నా, విదేశాలకు ఎగుమతుల్లో మాత్రం భారత్ ఆటోమొబైల్ కంపెనీలు వెనుక బడ్డాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో విదేశాలకు కార్ల ఎగుమతులు 5.5 శాతం తగ్గాయి. వివిధ దేశాల్లో ద్రవ్య లభ్యత సంక్షోభం నెలకొనడమే దీనికి కారణం అని ఇండస్ట్రీ బాడీ ‘సియామ్’ పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 47,61,299 కార్లు ఎగుమతి చేస్తే, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 45,00,492 యూనిట్లకు పరిమితమైంది.
వివిధ దేశాల్లో ఆర్థిక అనిశ్చితి కొనసాగడం వల్లే కార్ల ఎగుమతులు తగ్గాయని సియామ్ అధ్యక్షుడు వినోద్ అగర్వాల్ తెలిపారు. కొన్ని దేశాలకు వాణిజ్య వాహనాలు, ద్విచక్ర వాహనాలు ఎక్కువగా ఎగుమతి చేశామని, కొన్ని దేశాల్లో విదేశీ మారక ద్రవ్యం సంబంధ సమస్యలు తలెత్తాయన్నారు. వాణిజ్య వాహనాలు, ద్విచక్ర వాహనాలు, త్రీ వీలర్స్ ఎగుమతుల్లో గణనీయ క్షీణత నమోదైతే, కార్ల ఎగుమతుల్లో స్వల్ప పురోగతి రికార్డైంది. జనవరి-మార్చి త్రైమాసికంలో గుడ్ రికవరీ కనిపించిందని, ప్రత్యేకించి ద్విచక్ర వాహనాల ఎగుమతులు మెరుగయ్యాయని వినోద్ అగర్వాల్ చెప్పారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిస్థితి మెరుగవుతుందని ఆశాభావంతో ఉన్నాం అని వినోద్ అగర్వాల్ తెలిపారు. కాగా, 2022-23లో 6,62,703 కార్లు ఎగుమతి చేస్తే, 2023-24లో 1.4 శాతం గ్రోత్ తో 6,72,105 యూనిట్లకు చేరాయి. వాటిల్లో మారుతి సుజుకి 2,80,712 (2022-23లో 2,55,439) కార్లు ఎగుమతి చేస్తే హ్యుండాయ్ మోటార్స్ 1,53,019 యూనిట్ల నుంచి 1,63,155, కియా మోటార్స్ 52,105, ఫోక్స్ వ్యాగన్ 44,180, నిసాన్ మోటార్ ఇండియా 42,989, హోండా కార్స్ 37,589 కార్లు ఎగుమతి చేశాయి. ద్విచక్ర వాహనాల ఎగుమతులు 5.3 శాతం తగ్గి 36,52,122 యూనిట్ల నుంచి 34,58,416 యూనిట్లకు పడిపోయాయి. వాణిజ్య వాహనాల ఎగుమతుల్లో 16 శాతం, త్రీ వీలర్స్ ఎగుమతుల్లో 18 శాతం క్షీణత నమోదైంది.