హైదరాబాద్, ఆగస్టు 11: రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో ఫార్మా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 32 శాతం తగ్గి రూ.520.5 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.770 కోట్ల లాభాన్ని గడించింది.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం 9.4 శాతం అధికమై రూ.5,702 కోట్ల నుంచి రూ.6,236 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. ఈ సందర్భంగా కంపెనీ వైస్ చైర్మన్, ఎండీ కే నిత్యానంద రెడ్డి మాట్లాడుతూ..సవాళ్ళతో కూడిన పరిస్థితుల్లోనూ ఆశాజనక పనితీరు కనబరిచాము, ఔషధాలకోసం మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు చెప్పారు. గడిచిన త్రైమాసికంలో అమెరికా నుంచి వచ్చిన ఆదాయం 10.8 శాతం పెరిగి రూ.2,971 కోట్లకు చేరుకోగా, యూరప్ ఆదాయం మాత్రం 2 శాతం తగ్గి రూ.1,548 కోట్లకు తగ్గిందన్నారు.