న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయనడానికి నిదర్శనంగా జీఎస్టీ వసూళ్లు వరుసగా రెండో నెలలో రూ.1 లక్ష కోట్లను మించాయి. ఆగస్టు నెలలో వస్తు, సేవల విక్రయం ద్వారా రూ.1.12 లక్షల కోట్ల పన్నులు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాది ఇదేనెలలో వసూలైన రూ.86,449 కోట్ల మొత్తంతో పోల్చితే 2021 ఆగస్టులో 30 శాతం అధికంగా జీఎస్టీ వసూళ్లు జరిగాయి. అలాగే కొవిడ్ ముందస్తు ఏడాది 2019 ఆగస్టు నెలలో రూ.98,202 కోట్లు వసూలుకాగా, ఆ మొత్తంతో పోల్చితే ఈ ఆగస్టులో 14 శాతం ఎక్కువగా పన్ను వసూళ్లు జరిగినట్లు ఆర్థిక శాఖ వివరించింది. అయితే ఈ ఏడాది జూలై నెలలో జరిగిన వసూళ్లు రూ.1.16 లక్షల కోట్లకంటే 3.76 శాతం తక్కువగా ఆగస్టులో వసూలుకావడం గమనార్హం. కానీ వరుసగా రెండో నెలలోనూ జీఎస్టీ వసూళ్లు రూ. లక్ష కోట్లను మించాయి. కాగా 2021 ఆగస్టు వసూళ్లు రూ.1,12,020 కోట్లలో రూ.20,522 కోట్లు సెంట్రల్ జీఎస్టీ రూపంలోనూ, రూ.26,605 కోట్లు స్టేట్ జీఎస్టీగానూ, రూ.56,247 కోట్లు ఇంటిగ్రేటెడ్ జీఎస్టీగానూ వసూలైనట్లు ఆర్థిక శాఖ వివరించింది. సెస్ల రూపంలో రూ.8,646 కోట్లు వచ్చినట్లు ప్రకటన పేర్కొంది.
జూన్లో మినహా…
వరుసగా తొమ్మిదినెలలపాటు రూ.1 లక్ష కోట్ల మార్కుపైన జీఎస్టీ వసూళ్ల ట్రెండ్కు ఈ ఏడాది జూన్లో కొవిడ్ సెకండ్వేవ్ కారణంగా బ్రేక్పడింది. తిరిగి కొవిడ్ నియంత్రణలు క్రమేపీ తొలగడంతో జూలై, ఆగస్టు నెలల్లో వసూళ్లు రూ.లక్ష మార్కును దాటాయి. ఆర్థిక వ్యవస్థ వేగంగా రికవరీ అవుతున్నదనడానికి ఇది సంకేతమని ఆర్థిక శాఖ పేర్కొంటూ రానున్న నెలల్లో కూడా జీఎస్టీ ఆదాయం జోరుగా పెరుగుతుందని అంచనావేస్తున్నట్లు తెలిపింది. ఆర్థికాభివృద్ధికి తోడు పన్ను ఎగవేత కార్యకలాపాలకు అడ్డుకట్టవేయడం, ముఖ్యంగా నకిలీ బిల్లర్లపై చర్యలు తీసుకోవడం కూడా జీఎస్టీ వసూళ్ల పెరుగుదలకు దోహదపడిందని ప్రకటనలో వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రికార్డుస్థాయిలో రూ.1.41 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు జరగగా, సెకండ్వేవ్తో మే నెలలో రూ.1.02 కోట్లకు వసూళ్లు తగ్గాయి. జూన్లో ఇవి మరింత తగ్గి రూ.92 వేల కోట్లకు పడిపోయాయి.
వార్నింగ్ సిగ్నల్స్…
ఈ ఏడాది జూలైకంటే ఆగస్టులో వసూళ్లు తగ్గడం, ఆగస్టు నెలలో మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) తగ్గడం ఆందోళనకరమని ఇక్రా చీఫ్ ఎకనామిస్ట్ అదితి నాయర్ హెచ్చరించారు. జూలై నెలలో 55.3గా నమోదైన మాన్యుఫాక్చరింగ్ పీఎంఐ ఆగస్టులో 52.3 శాతానికి తగ్గిందని, మౌలిక రంగాల వృద్ధి కూడా అంచనాలకంటే తక్కువగా ఉందని, ప్రస్తుత త్రైమాసికంలో ఆర్థిక రికవరీపై ఇవి హెచ్చరిక సంకేతాలని అదితి పేర్కొన్నారు. ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 7.8-8.8 శాతం మధ్య ఉండవచ్చని తాము అంచనావేస్తున్నట్లు తెలిపారు. గతేడాది లోయర్బేస్ కారణంగా ఈ ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్లో జీడీపీ 20.1 శాతం పెరిగిన విషయం తెలిసిందే. రానున్న నెలల్లో జీఎస్టీ వసూళ్లు మరింత పెరుగుతాయన్న అంచనాల్ని సింఘానియా జీఎస్టీ కన్సల్టెన్సీ అండ్ కో పార్టనర్ ఆదిత్యా సింఘానియా వెల్లడించారు.
17న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
కొవిడ్ అత్యవసరాలపై రేట్ల తగ్గింపును సమీక్షించడంతో పాటు ఇతర అంశాల్ని చర్చించేందుకు సెప్టెంబర్ 17న లక్నోలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ 45వ సమావేశం 17న జరుగుతుందంటూ కేంద్ర ఆర్థికశాఖ బుధవారం ట్వీట్ చేసింది.
ఏ ఆకారంలో ఉన్నా పాపడ్పై జీఎస్టీ లేదు ఏ పేరుతో పిలుచుకున్నా, ఏ ఆకారంలో ఉన్నా పాపడ్ను జీఎస్టీ నుంచి మినహాయించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయింకా చేసిన ట్వీట్కు స్పందనగా పాపడ్పై ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) వివరణ ఇచ్చింది. ‘రౌండ్గా ఉండే పాపడ్కు జీఎస్టీ మినహాయింపు ఉందని, స్కేర్ రూపంలో ఉన్న పాపడ్పై జీఎస్టీ ఉంటుందని మీకు తెలుసా? ఈ లాజిక్ను అర్థంచేసుకోవడానికి ఒక మంచి చార్టర్డ్ అకౌంటెంట్ను కాస్త సూచిస్తారా’ అంటూ ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ గోయింకా ట్వీట్ చేసారు. ఇందుకు ప్రతిగా గోయింకా ట్వీట్ను సీబీఐసీ జతచేస్తూ చేసిన రీట్వీట్లో ‘జీఎస్టీ నోటిఫికేషన్ నం.2/2017-సీటీ(ఆర్) ఎంట్రీ నం.96 ప్రకారం పాపడ్, పేరు ఏదైనా, ఏ ఆకారంలో ఉన్నా పన్ను మినహాయింపు ఉంది. ఈ నోటిఫికేషన్ను cbic.gov.inలో చూడవచ్చు’ అంటూ పేర్కొంది.