Auto Sales | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశీయ మార్కెట్లో వాహన విక్రయాలు గత నెల ఆగస్టులో పరుగులు పెట్టాయి. దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ మునుపెన్నడూ లేనివిధంగా అమ్మకాలను నమోదు చేసింది. పండుగ సీజన్కుతోడు, వినియోగదారులను ఎస్యూవీలు ఆకట్టుకోవడం కలిసొచ్చిందని మార్కెట్ వర్గాలు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నాయి. ఈ క్రమంలోనే రికార్డు స్థాయి సేల్స్ జరిగినట్టు చెప్తున్నాయి. నిరుడు ఆగస్టుతో పోల్చితే హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టయోట ఆకర్షణీయ వృద్ధిని అందుకున్నాయి.
‘ఆగస్టు పరిశ్రమకు చాలా కలిసొచ్చిన నెల. ప్యాసింజర్ వాహనాల విక్రయాలు గత నెల 3,60,897 యూనిట్లుగా ఉన్నాయి. ఒక్క నెలలో ఈ స్థాయిలో అమ్మకాలు నమోదవడం ఇదే తొలిసారి’ అని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్-సేల్స్) శశాంక్ శ్రీవాత్సవ అన్నారు. నిరుడు సెప్టెంబర్లో 3,55,400 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇప్పటిదాకా ఇదే రికార్డు. ఇది ఆగస్టుతో చెరిగిపోయింది. కాగా, గత ఏడాది ఆగస్టులో 3,26,980 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఇక ఈ ఏడాది ఏప్రిల్-ఆగస్టులో 17 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఎస్యూవీ వాహన సెగ్మెంట్ ఆగస్టులో 48.6 శాతం వృద్ధిని చూసింది.