న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి.. ఎలక్ట్రిక్ ఎస్యూవీ కార్లను ఆవిష్కరించ బోతున్నది. వచ్చే నెల 22న ఈ-ట్రాన్, ఈ-ట్రాన్ స్పోర్ట్ బ్యాక్ మోడల్ కార్లను భారత విపణిలో ఆవిష్కరించనున్నట్లు మంగళవారం తెలిపింది. ఈ కార్లు కొనుగోలు చేయాలని భావించే వారు ఇప్పటి నుంచే బుకింగ్ చేసుకోవచ్చు.
ఈ ఎస్యూవీ మోడల్ కార్ల పట్ల ఆసక్తి గల వారు ప్రారంభంలో రూ.5 లక్షలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ-ట్రాన్ బ్రాండ్ కింద పలు నూతన మోడల్ కార్లను విపణిలోకి ప్రవేశపెట్టనున్నట్లు ఆడి ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.
కస్టమర్లు ఆన్లైన్ వెబ్సైట్లో గానీ, వారికి సమీప ఆడి ఇండియా డీలర్ వద్ద గానీ ఈ-ట్రాన్, ఈ-ట్రాన్ స్పోర్ట్ బ్యాక్ కార్లు బుక్ చేసుకోవచ్చునని వెల్లడించింది.
గతేడాది చివరిలోనే ఈ-ట్రాన్ మోడల్ కార్లను ఆవిష్కరించాలని ఆడి ఇండియా తలపెట్టినా.. కరోనా మహమ్మారి నేపథ్యంలో వాయిదా వేసింది. ఈ-ట్రాన్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కార్లతో దేశంలో తమ ఎలక్ట్రిక్ వాహనాల ప్రయాణం మొదలవుతుందని ఆడి ఇండియా పేర్కొంది.
భారతదేశంలో భవిష్యత్ అంతా విద్యుత్ కార్లదేనని ఆడి ఇండియా అధిపతి బల్బీర్ సింగ్ ధిల్లాన్ చెప్పారు. ఆడి ఈ-ట్రాన్, ఈ-ట్రాన్ స్పోర్ట్ బ్యాక్ మోడల్ ఎస్యూవీ కార్ల బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్లు చెప్పడానికి తాము ఆసక్తిగా ఉన్నామన్నారు.
ఈ-ట్రాన్ ఒక ఉత్పత్తి మాత్రమే కాదని, ఒక బ్రాండ్ అని బల్బీర్ సింగ్ ధిల్లాన్ అన్నారు. ఈ బ్రాండ్ కింద తాము పలు నూతన మోడళ్లను ప్రారంభిస్తామని తెలిపారు. ఎలక్ట్రిక్ కార్ల తరం మొదలైనట్లేనన్నారు.
ఈ-ట్రాన్, ఈ ట్రాన్ స్పోర్ట్ బ్యాక్ కార్లు డ్యూయల్ మోటార్ సెటప్ కలిగి ఉన్నాయి. 95కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో 300 కిలోవాట్ల/ 408 హెచ్పీ పవర్ ఉత్పత్తి చేస్తాయి. 5.7 సెకన్లలో 100 కి.మీ. వేగంతో దూసుకెళ్ల గల సామర్థ్యం వీటి సొంతం.
ఫోర్ జోన్ ఎయిర్ కండీషనర్తో ఇంటివద్ద 11కేడబ్ల్యూ ఏసీ హోం చార్జర్తో 8.5 గంటల్లో ఈ రెండు కార్ల బ్యాటరీలు చార్జి చేసుకోవచ్చు. ప్రోగ్రెసివ్ స్టీరింగ్, అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, ఎలక్ట్రిక్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం తదితర ఫీచర్లు వీటిలో జత చేశారు.