5G Auction | టెలికం రంగం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 5జీ స్పెక్ట్రం వేలం ప్రక్రియ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నది. అదే సమయంలో టెలికం రంగంలోనూ సంస్కరణలు తీసుకు రావాలని కేంద్రం భావిస్తున్నది. ప్రత్యేకించి టెలికం రంగంపై నియంత్రణ కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)లో ప్రస్తుత పరిస్థితులకు అనుగునంగా మార్పులు తేవాల్సి ఉందన్నారు. ఇక 2022 ఏప్రిల్-మే నెలల్లో ప్రారంభం అవుతుందని కేంద్ర టెలీ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం తెలిపారు.
గురువారం ఆయన టైమ్స్ నౌ సమ్మిట్-2021లో మాట్లాడుతూ.. 5జీ స్పెక్ట్రం వేలంపై విధి విధానాలను ప్రతిపాదిస్తూ నివేదిక సమర్పించాలని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)ను కోరాం.. దీనిపై సంప్రదింపులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి నాటికి ట్రాయ్ నివేదిక సమర్పిస్తుందని భావిస్తున్నాం అని చెప్పారు. అయితే, 5జీ స్పెక్ట్రం వేలంపై సంప్రదింపులు సంక్లిష్టంగా ఉన్నాయని, విభిన్న అభిప్రాయాలు వస్తున్నాయన్నారు.
ట్రాయ్ నుంచి నివేదిక రాగానే వేలం ప్రక్రియ చేపడతామని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. స్వల్ప కాలిక సమయానికి బదులు 5జీ స్పెక్ట్రం కొన్నేండ్ల వరకు.. కనీసం 5-10 ఏండ్ల గడువు వరకు కేటాయించాలని కేంద్రం భావిస్తున్నదన్నారు. ప్రస్తుత పరిస్థితులతోపాటు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ట్రాయ్ నియంత్రణ విధానాలను రూపొందించాలని భావిస్తున్నట్లు తెలిపారు.