ముంబై, జూలై 21: ఏటీఎం లావాదేవీలపై బ్యాంకుల ఇంటర్చేంజ్ ఫీజుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల చేసిన సవరణలు వచ్చే నెల మొదట్నుంచి అమల్లోకి రానున్నాయి. ఆర్థిక లావాదేవీల ఇంటర్చేంజ్ ఫీజును రూ.15 నుంచి 17కు పెంచగా, ఆర్థికేతర లావాదేవీలపై రూ.5 నుంచి 6కు పెంచింది. ఈ కొత్త చార్జీలు ఆగస్టు 1 నుంచి వర్తించనున్నాయి. ఆర్బీఐ వివరాల ప్రకారం క్రెడిట్ కార్డులు లేదా డెబిట్ కార్డుల ద్వారా జరిగే చెల్లింపుల ప్రాసెసింగ్ కోసం వ్యాపారుల నుంచి ఈ ఇంటర్చేంజ్ ఫీజులను బ్యాంకులు వసూలు చేస్తాయి. దేశంలో వివిధ బ్యాంకులు జారీ చేసిన దాదాపు 90 కోట్ల డెబిట్ కార్డులుంటాయని అంచనా.
తమకు ఖాతాలున్న బ్యాంక్ ఏటీఎంల నుంచి నెలకు ఐదుసార్లు కస్టమర్లు ఉచిత లావాదేవీలు జరుపుకోవచ్చని ఆర్బీఐ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలకు కలిపి ఈ పరిమితి వర్తిస్తుంది. ఇక ఇతర బ్యాంక్ ఏటీఎంల నుంచి మెట్రో నగరాల్లోనైతే మూడుసార్లు, నాన్-మెట్రో నగరాల్లో ఐదుసార్లు ఉచితంగా లావాదేవీలను జరుపవచ్చు. అయితే ప్రస్తుతం ఈ పరిమితి దాటిన ఒక్కో లావాదేవీపై రూ.20 చొప్పున చార్జీలుండగా, వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రూ.21 వసూలు చేయనున్నారు. పెరిగిన నిర్వహణ వ్యయం వల్లే ఈ చార్జీల పెంపునకు అనుమతిస్తున్నట్లు ఆర్బీఐ ఓ తాజా ప్రకటనలో తెలిపింది.