ATF Rate Cut | విమానయాన సంస్థలకు కేంద్ర చమురు సంస్థలు శనివారం రిలీఫ్ కల్పించాయి. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్), జెట్ ఫ్యూయల్ ధరలు 2.2 శాతం తగ్గించాయి. ఏటీఎం కిలో లీటర్పై రూ.3,084.94 తగ్గించడంతో దాని ధర రూ.1,38,147.93కు చేరుకున్నదని కేంద్ర చమురు సంస్థలు తెలిపాయి. తాజాగా సవరించిన రేట్ల ప్రకారం ఢిల్లీలో జెట్ ఫ్యూయల్ కిలో లీటర్ ధర రూ. 1,38,147.95, ముంబైలో రూ.1,37,095.74లకు తగ్గింది. ఏటీఎఫ్ ధరలు తగ్గించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి.
గత నెల ఏటీఎఫ్ కిలో లీటర్ ధర రూ.1,41,232.87 (లీటర్ రూ.141.23) పలికింది. సాధారణంగా ప్రతి నెలా ఒకటో తేదీన, 16న ఏటీఎఫ్ ధరలను కేంద్ర చమురు సంస్థలు సవరిస్తుంటాయి. తాజాగా ఏటీఎఫ్ ధర తగ్గించడం వల్ల విమానయాన సంస్థల నిర్వహణ వ్యయం తగ్గనున్నది. ఎయిర్లైన్స్ నిర్వహణ వ్యయంలో 40 శాతం వరకు జెట్ ఫ్యూయల్ ధరే ఉంటుంది.
గత నెలలో ఏటీఎఫ్ ధరలు 16 శాతానికి పైగా పెంచేస్తూ కేంద్ర చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర మండుతుండటంతో ఏటీఎఫ్ ధర పెంచేశాయి. దీంతో ఢిల్లీలో గత నెలలో కిలో లీటర్ ఏటీఎఫ్ రూ.19,757.13 (16.26 శాతం) పెంచి వేశాయి. దీంతో గత నెలలో ఏటీఎఫ్ ధర రూ.1,41,232.87లకు చేరింది.
అంతర్జాతీయ విమాన సర్వీసులకు సరఫరా చేసే ఏటీఎఫ్పై ఎక్సైజ్ డ్యూటీ సడలించినట్లు ఈ వారం ప్రారంభంలో కేంద్ర ఆర్థికశాఖ వివరణ ఇచ్చింది. దీనివల్ల దేశీయ విమానయాన సంస్థలు నడిపే విదేశీ సర్వీసుల విమానాలకు రిలీఫ్ లభిస్తుంది. తగ్గిన ఏటీఎఫ్ ధరలకు అనుగుణంగా ఎయిర్లైన్స్ విమాన ప్రయాణ టికెట్ల ధరలు తగ్గిస్తే, ప్రయాణికులకు స్వల్పంగా ఉపశమనం కలుగుతుంది.
ఇదిలా ఉంటే పెట్రోల్ లీటర్ ధర రూ.96.72, లీటర్ డీజిల్ ధర రూ.89.62 స్థిరంగా కొనసాగుతున్నాయి. గత మే 22వ తేదీన ఎక్సైజ్ డ్యూటీలో కోత విధించడంతో లీటర్ పెట్రోల్పై రూ.8.69, లీటర్ డీజిల్ ధర రూ.7.05 తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టినా.. దేశీయంగా మాత్రం స్థిరంగానే ఉన్నాయి.