Kotak Mahindra | ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్.. కొటక్ మహీంద్రా బ్యాంకు అత్యధిక మోసాలకు గురైంది. 2021-21 ఆర్థిక సంవత్సరం తొలి 9నెలల్లో రూ.లక్ష, అంతకంటే విలువైన ఎక్కువ మోసాలు 642 జరిగాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ మంగళవారం లోక్సభ ప్రశ్నోత్తరాల్లో సభ్యులకు రాతపూర్వక సమాధానంలో తెలిపారు. రెండో స్థానంలో నిలిచిన ఐసీఐసీఐ బ్యాంకులో 518, ఇండస్ ఇండ్ బ్యాంక్లో 377 మోసాలు జరిగాయన్నారు. బ్యాంకుల్లో సంస్థాగత, విధానపరమైన సంస్కరణలు తేవడానికి ఆర్బీఐ జారీ చేసిన గైడ్లైన్స్ వల్ల గత ఐదేండ్లుగా మోసాలు తగ్గుముఖం పట్టాయన్నారు.
2016-17లో కొటక్ మహీంద్రా బ్యాంకులో 135, 2017-18లో 289, 2018-19లో 383, 2019-20లో 652, 2020-21లో 826 ఫ్రాడ్లు నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొటక్ మహీంద్రా బ్యాంకులో 642 మోసాలు చోటు చేసుకుంటే, ఐసీఐసీఐలో 518 ఘటనలు జరిగాయని భగవత్ కరాడ్ తెలిపారు.
ఇండస్ఇండ్ బ్యాంకులో 377 ఫ్రాడ్లు, యాక్సిస్ బ్యాంకులో 235 మోసాలు నమోదయ్యాయి. ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐలో 159, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల్లో 151 ఫ్రాడ్లు జరిగాయి. మూడేండ్లుగా ఎస్బీఐలో మోసాలు తగ్గుముఖం పట్టాయి. బ్యాంకుల్లో ఫ్రాడ్ల నివారణకు ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టిందని భగవత్ కరాడ్ అన్నారు.