న్యూఢిల్లీ : ఆర్ధిక మందగమనం వెంటాడుతుండటంతో వ్యయ నియంత్రణ పేరుతో టెక్ దిగ్గజాల నుంచి పలు కంపెనీలు ఉద్యోగులపై వేటు వేస్తూ లేఆఫ్స్కు తెగబడుతున్నాయి. మెటా, అమెజాన్, ట్విట్టర్ సహా జొమాటో సైతం లేఆఫ్స్ను వెల్లడించగా తాజాగా నెట్వర్కింగ్ దిగ్గజం సిస్కో లేఆఫ్స్ బాంబు పేల్చింది. కొన్ని బిజినెస్ల రీబ్యాలెన్సింగ్లో భాగంగా 4000 మంది ఉద్యోగులను సిస్కో తొలగించనున్నట్టు తెలిసింది.
సిస్కోలో ప్రపంచవ్యాప్తంగా 83,000 మంది పనిచేస్తున్నారు. వీరిలో 4100 మంది ఉద్యోగులను కంపెనీ సాగనంపనుందని సిలికాన్ వ్యాలీ బిజినెస్ జర్నల్ పేర్కొంది. కంపెనీ తొలి త్రైమాసిక ఫలితాల్లో భాగంగా సిస్కో చైర్మన్, సీఈఓ చక్ రాబిన్స్ లేఆఫ్స్పై ఎలాంటి వివరాలు వెల్లడించకున్నా కొన్ని వ్యాపారాలను రీబ్యాలెన్సింగ్ చేపడుతున్నామని అందులో భాగంగా లేఆఫ్స్ ఉంటాయనే సంకేతాలు పంపారు.
ఉద్యోగులతో మాట్లాడిన తర్వాతే వివరాలు వెల్లడించగలమని చెప్పుకొచ్చారు. సిస్కో సీఎఫ్ఓ స్కాట్ హెరెన్ సైతం లేఆఫ్స్పై ఇదే తరహాలో స్పందించారు. సెక్యూరిటీ, క్లౌడ్ డెలివర్డ్ ప్రోడక్ట్స్పై దృష్టిసారించామని చెప్పారు. నియామకాలను పరిగణనలోకి తీసుకుంటే కొలువులు కోల్పోయే వారి సంఖ్య తక్కువగానే ఉంటుందని అన్నారు.