హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉత్తమ మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తిం చి అవార్డులను అందించేందుకు ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో), యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (వైఎఫ్ఎల్ఓ) సంయుక్తంగా దరఖాస్తులు ఆహ్వానించాయి. దరఖాస్తులు సమర్పించేందుకు ఈ నెల 10 చివరి తేదీ. జనవరి 11న అవార్డుల ప్రదానం ఉంటుంది.
అగ్రీటెక్, ఫుడ్, ఫుడ్ ప్రాసెసింగ్, విద్య, పర్యావరణం, ఫ్యాషన్-టెక్స్టైల్, ఆరోగ్య పరిరక్షణ, వెల్నెస్ , తయారీ/ఎంఎస్ఎంఈ, ఆర్కిటెక్చర్, ఈవెంట్ మేనేజ్మెంట్, సోషల్ ఎంటర్ప్రైజెస్ తదితర రంగాల్లో అవార్డులు ఉంటాయని, అలాగే అంగ వైకల్యంగల మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక అవార్డులు బహూకరిస్తామన్నారు. కొత్త ఆవిష్కరణలు, ప్రతిభ, ఉత్తమ విధానాలు, విజయం, అచీవ్మెంట్స్, ఎకనమిక్ అండ్ సోషల్ కాంట్రిబ్యూషన్ తదితర అంశాల ఆధారంగా అవార్డులకు ఎంపికచేయనున్నట్లు చెప్పారు. దరఖాస్తు చేయనున్న కంపెనీ ఖచ్చితంగా మహిళల పేర నిర్వహించబడుతున్నదై ఉండాలని స్పష్టంచేశారు.