న్యూయార్క్ : టెక్ దిగ్గజం యాపిల్ (Apple) వందలాది కాంట్రాక్టు ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. వీరి ఉద్యోగాలకు ఢోకా లేదని గతంలో కాంట్రాక్టు ఉద్యోగులకు భరోసా ఇచ్చిన కంపెనీ తాజాగా వారిపై వేటు వేయడం షాక్కు గురిచేసింది. థర్డ్ పార్టీ ఏజెన్సీలు హైర్ చేసిన ఉద్యోగులైన వీరంతా ఆయా ప్రాజెక్టులపై యాపిల్ ఉద్యోగులతో పనిచేస్తున్నారు. అలాంటి కాంట్రాక్టు ఉద్యోగులపై యాపిల్ కొరడా ఝుళిపించింది.
ఖర్చులు తగ్గించుకునేందుకే కాంట్రాక్టు ఉద్యోగులనూ యాపిల్ తొలగించిందని కంపెనీ వర్గాలు పేర్కొన్నట్టు సమాచారం. యాపిల్తో ఈ వర్కర్లు 15 నెలల కాంట్రాక్టులు కలిగిఉన్నా వారి ఒప్పందం ముగిసేవరకూ వేచిచూడని కంపెనీ వారిని ఉన్నపళాన ఉద్యోగాల నుంచి తొలగించింది. తమ ఉద్యోగాలు సురక్షితమని గతంలో యాపిల్ ఇచ్చిన హామీని ఇప్పుడు ఉల్లంఘించిందని కొలువు కోల్పోయిన ఓ ఒప్పంద ఉద్యోగి వాపోయారు.
కాగా ఖర్చులను జాగ్రత్తగా నెట్టుకొస్తున్నామని, ఈ క్రమంలో పలు విభాగాల్లో హైరింగ్ నిలిపివేయగా మరికొన్ని విభాగాల్లో నియామకాలను చేపడుతున్నామని టెక్ దిగ్గజం ఇటీవల పేర్కొంది. అయితే యాపిల్ చివరికి ఒప్పంద ఉద్యోగులపైనా వేటు వేయడం ద్వారా కంపెనీ భిన్నమైన సంకేతాలను పంపినట్లయిందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇక ఒప్పంద ఉద్యోగులను తమ ఉద్యోగులుగా యాపిల్ పరిగణించదని, ఈ ఉద్యోగుల తొలగింపును లేఆఫ్స్గా చూడలేమని కంపెనీ స్పష్టం చేసింది. వీరికి పరిహార ప్యాకేజ్ కూడా చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో ఒప్పంద ఉద్యోగులను యాపిల్ సునాయాసంగా విధుల నుంచి తొలగించే వెసులుబాటు కలిగింది.